మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా చేసుకుంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్యుడికి పేర్లు. కుమారస్వామికి ఆరు ముఖాలు. కనుక షణ్ముఖుడని కూడా పేరు. కార్తికేయుడిని ‘మహామతి’గా అభివర్ణిస్తారు. ఆయన బుద్ధిని ప్రేరేపించే స్వామి. సుబ్రహ్మణ్య ఆరాధనతో మనోబలం లభిస్తుంది. బుద్ధి ప్రచోదనం అవుతుంది. సత్కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది. ‘బుద్ధి శక్తి దేవత’ అని శరవణభవుణ్ని స్తుతిస్తారు. ఆయన ఉపాసనతో దుష్కర్మలు చేయాలన్న తలంపు తొలగిపోతుంది. సత్కర్మలు ఆచరించాలన్న బుద్ధి పుడుతుంది. సజ్జనుల క్షేమం కోసం ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. శక్తి కుమారుడికి ఇచ్చిన శూలాన్ని.. జ్ఞానశూలం అనడం వెనుక ఆంతర్యం కూడా ఇదే!
సుబ్రహ్మణ్యస్వామిని సర్పాలకు మూలదేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి. రెండు విరుద్ధ భావనలను, ధర్మాలను ఒక్కతాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉంది. అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, సుబ్రహ్మణ్య స్వామిని సంతాన కారకుడిగా, సంపత్తి దాతగా, ఆరోగ్య ప్రదాతగా భావిస్తుంటారు. స్వామి అనుగ్రహంతో ఇవన్నీ సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. స్వామి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహించాలని పెద్దలు చెప్తారు. చలికాలంలో వచ్చే ఈ పర్వదినాన పేదల చలిబాధను నివారించడమే వ్రతంలోని ఆంతర్యం.