ఓ ఆశ్రమంలో నది ఒడ్డున సత్సంగం జరుగుతున్నది. భక్తులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు గురువు సమాధానాలిస్తున్నాడు. ‘నా జీవితమంతా సమస్యలే. వాటిని ఎదుర్కోలేక సతమతమవుతున్నాను’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు అడిగాడు. గురువు చిన్నగా నవ్వి ‘పక్కనే నదిలో ఉన్న తుంగ మొక్కలని కొద్దిసేపు చూసి రమ్మ’న్నాడు. అతను అలాగే చూసి వచ్చాడు. ‘ఏం గమనించావు?’ అని ప్రశ్నించాడు గురువు.
‘నీటి ప్రవాహానికి తుంగ వంగుతున్నది. ప్రవాహం ఆగినప్పుడు మళ్లీ మామూలు స్థితికి వస్తున్నది. అందులో విశేషమేముంది?’ అని బదులిచ్చాడు. ‘అందులో చాలా పరమార్థం ఉంది నాయనా! తుంగ, నీటి ప్రవాహాన్ని ఎదుర్కోవాల్సి వస్తే… మనం కాల ప్రవాహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నదిలో నీటి ప్రవాహంలా.. కాలవాహినిలో కష్టాలు అందరికీ వస్తాయి. పరిస్థితులకు తలవంచి ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి తుంగలా నిలబడాలి. దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతాం. అలాగే తుంగను తాకిన నీరు స్థిరంగా అక్కడే ఉండదు. అలాగే మనకు ఎదురైన సమస్యలు కూడా స్థిరంగా ఉండవు. ‘ప్రవాహం పైపైకి వస్తోందే..’ అని తుంగ బెదరదు. ఉన్నచోటనే నిలబడి తన మనుగడ సాగిస్తుంది. కాలప్రవాహం కూడా మనల్ని ఎన్నో ఆటుపోట్లకు గురి చేస్తుంది. వాటికి భయపడి పారిపోకూడదు. వాటినే ఆలోచిస్తూ కూర్చోకూడదు. కాలం ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. వాటిని అంగీకరించాలి. ధైర్యంగా నిలబడాలి. ఆ కాలప్రవాహంలో కష్టాలు, కన్నీళ్లే కాదు, సుఖాలు సంతోషాలు కూడా ఉంటాయి. అన్నిటినీ సమంగా ఆస్వాదించాలి’ అని వివరించాడు గురువు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821