అణో రణీయాన్ మహతో మహీయాన్
ఆత్మాస్య జంతో ర్నిహితో గుహాయాం॥ (కఠోపనిషత్తు) ‘ఆత్మ తత్వం అణువు కంటే అణువుగా, మహత్తు కంటే మహత్తుగాను ప్రతీ జీవి హృదయంలో నివసిస్తున్నది’ గౌతమ మహర్షి యాగం చేసి అన్నీ దానమిస్తుండగా కుమారుడైన నచికేతుడు ‘నన్నెవరికి దానమిస్తారు?’ అని పదేపదే ప్రశ్నించాడు. విసుగు చెందిన గౌతముడు ‘యముడి’కి అని కసిరాడు. తండ్రిని ఒప్పించి నచికేతుడు యముడికి దానం అయ్యాడు. నచికేతుడు యమపురికి వెళ్లేసరికి అక్కడ సమవర్తి లేడు. ఆయన రాకకోసం మూడు రాత్రులు అక్కడే నిరాహారంగా గడిపాడు. యముడు వచ్చి పలకరించాడు. తన కోసం కాచుకొని మూడు రాత్రులు ఉన్న పిల్లవాడికి మూడు వరాలు ఇస్తానన్నాడు. మొదటి వరంగా ‘మా నాన్నగారి కోపం తగ్గాలి’ అని కోరాడు నచికేతుడు.
రెండో వరంగా చావుపుట్టుకలు లేని స్వర్గాన్ని అగ్ని చయనం ద్వారా పొందవచ్చు అంటారు కదా, ఆ క్రతువు విజ్ఞానాన్ని బోధించమన్నాడు. యముడు ఉపదేశించాడు. విన్నదంతా పొల్లుపోకుండా అప్పజెప్పడంతో ఇది ‘నాచికేతాగ్ని చయనం’గా ప్రసిద్ధి చెందుతుందని దీవించాడు. ‘ఆత్మ ఎలా యథార్థమో వివరించండి?’ అని కోరాడు నచికేతుడు. ‘ఆత్మ గురించి దేవతలే చెప్పలేకపోయారు. మరో వరం కోరుకో’ అన్నాడు యముడు. నచికేతుడు పట్టు వీడలేదు. చివరికి యముడు ఆత్మ తత్వాన్ని ఇలా విశదీకరించాడు. ‘మనిషి రెండు దారులలో వెళుతుంటాడు. ఒకటి శ్రేయోమార్గం అంటే నివృత్తి. రెండోది ప్రేయోమార్గం అంటే ప్రవృత్తి. మొదటిది జనన మరణ చక్రం నుంచి దాటిస్తుంది. రెండోది అందులో బంధిస్తుంది. కఠోరమైన మనోనిగ్రహంతో శ్రేయో మార్గంలో వెళ్తే మృత్యువును అధిగమించి అమృతత్వాన్ని పొందవచ్చు’ అని వివరించాడు.
– డా.వెలుదండ సత్యనారాయణ