ఓ గ్రామీణ యువకుడు బాగా చదివి ఆర్కిటెక్ట్ అయ్యాడు. పట్టణంలో ప్రాక్టీసు ప్రారంభించి చాలా పేరు గడించాడు. ఒకరోజు తీరిక కుదరడంతో సొంత గ్రామానికి వెళ్లాడు. అక్కడ తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన తెలుగు పండితుడు కనిపించాడు. ఎలా ఉన్నావని ప్రశ్నించాడు పండితుడు.
‘ఆస్తులు, అంతస్తులు, సంఘంలో గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ..’ అని నీళ్లు నమిలాడు ఆర్కిటెక్ట్. ‘సమస్య ఏమిటి?’ అని అడిగాడు పండితుడు. ‘నేను ఇంటి నిర్మాణానికి ప్లాన్లు గీస్తుంటాను. నేను గీసినట్టుగానే ఇల్లు అందంగా పూర్తి అవుతుంది. ఎక్కడా చిన్న తేడా రాదు. కానీ, నా జీవితంలో మాత్రం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు! కారణం ఏమిటి?’ అని అడిగాడు. పండితుడు నవ్వి ‘నువ్వేకాదు. ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా తమ జీవితాన్ని ప్రణాళిక చేసుకుంటారు. అలాగే జరగాలని భావించి అహర్నిశలూ అందుకోసం కష్టపడతారు. అది ఎలాంటిదంటే ఎర వెంట పరిగెడుతూ చేప ‘దాన్ని వేటాడుతున్నాను’ అనుకుంటుంది. ఎర తన వేటకే అని తర్వాత గానీ దానికి తెలియదు.
మనలో చాలామంది తాము అనుకున్న ప్రణాళికలో చిన్నమార్పు జరిగినా తల్లడిల్లిపోతారు. తమ కోరికల చిట్టాను పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతారు. ఏవేవో కోరుకొని వాటికోసం వెంపర్లాడుతారు. అనుకున్న ఫలితం రాకపోతే డీలా పడిపోతుంటారు. గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్టు ప్రయత్నం వరకే మనది. ఫలితం ఆశించొద్దు. ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి. జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. ప్రకృతికి విధేయులమై ఉండాలి. లేకపోతే అశాంతి, నిరాశకు గురవుతాం’ అని వివరించాడు పండితుడు. ‘నిజమే నా ప్రణాళికల గురించే ఆరాటపడ్డాను. దేవుడి మాస్టర్ ప్లాన్ గురించి మరిచాను’ అనుకున్నాడు ఆర్కిటెక్ట్.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821