Chintana | అలీబిన్ హుసైన్ (రజి) ఒకసారి తన బానిసకు వేడినీళ్లు తీసుకురావాలని పురమాయించారు. నీళ్లు తెస్తుండగా ఆమె చేయిజారడంతో వేడినీళ్లు అలీబిన్ హుసైన్ ముఖంపై పడ్డాయి. దీనికి బానిసపై అలీ మండిపడ్డారు. ఆ బానిస వెంటనే ఖురాన్లోని ‘కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు.. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టం’ (3:134) అనే వచనాన్ని చదివింది. దాంతో అలీబిన్ మనసు తేలికైంది. ఆమెను మన్నించారు. బానిస సంకెళ్ల నుంచి ఆమెకు విముక్తి కల్పించారు.
‘కుస్తీ పోటీలో శత్రువును చిత్తుచేసేవాడు కాదు వీరుడు, కోపాన్ని దిగమింగేవాడే నిజమైన వీరుడు’ అని ప్రవక్త బోధించారు. కోపం మానవ సహజ నైజమైతే కోపాన్ని దిగమింగడం సజ్జనుల లక్షణం అంటుంది ఖురాన్. ఒకసారి ఒక శిష్యుడు ప్రవక్త (సఅసం) దగ్గరికొచ్చి ‘నాకేదైనా హితోపదేశం చేయండి’ అని అడిగాడు. దానికి ముహమ్మద్ ప్రవక్త (సఅసం) ‘కోపగించుకోకు’ అని చెప్పారు.
ఇలా ఎన్నిసార్లు అడిగినా ప్రవక్త (సఅసం) అదే హితోపదేశం చేశారు. ఒక మనిషి నైతికతను అంచనా వేయాలంటే అతని కోపావేశాలను చూసి చెప్పవచ్చు. కోపం సైతాన్ లక్షణం. కోపం వచ్చినప్పుడు ‘అవూజు బిల్లాహి మినష్షయితానిర్రజీం’ పఠించుకోవాలని ప్రవక్త సూచించారు. నిల్చుని ఉన్నస్థితిలో కోపం వస్తే కూర్చోవాలి. ఒకవేళ కూర్చుని ఉంటే కాసేపు మేను వాల్చాలి’ అని ప్రవక్త తాకీదు చేశారు. కోపం వచ్చినప్పుడు ‘వుజూ’ చేయాలని, మంచినీళ్లు తాగాలని మరో సందర్భంలో చెప్పారు.
– ముహమ్మద్ ముజాహిద్