ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడు. తండ్రి నవ్వి ‘మన ముందు ఎవరు కూర్చున్నారనే విషయం పట్టించుకోవద్దు. అప్పుడే నీ ఉపన్యాసం కొనసాగుతుంది. వారిని చూసి తడబడితే నువ్వు అనుకున్నది చెప్పలేవు. వారికన్నా నువ్వు తక్కువ అనే ఆలోచన వస్తే వాక్ప్రవాహం మందకొడిగా సాగుతుంది. ఎంతటి మేధావులకైనా తెలియని విషయాలు కొన్ని ఉంటాయి.
జ్ఞానంలో ఎవరూ సంపూర్ణులు కారు. కాబట్టి, శ్రోతలు ఎంతటివారైనా, వారికన్నా మనం నాలుగాకులు ఎక్కువ చదివామని భావిస్తేనే, ఉపన్యాసంపై పట్టు దొరుకుతుంది’ అని చెప్పాడు. ‘సభలో ఎందరు ఉన్నారని ఆలోచించకు. సభపై పట్టు దొరికాక ఆహూతుల వైపు పలకరింపుగా చూస్తూ నువ్వు చెప్పదలచిన విషయాన్ని ధైర్యంగా చెప్పు’ అని భుజం తట్టాడు తండ్రి. ‘నిజమే, శస్త్రచికిత్స సమయంలో రోగి ప్రముఖుడా, సామాన్యుడా అని ఆలోచించి చికిత్స చేయం కదా! ప్రముఖ వ్యక్తి అని తెలిస్తే ఒత్తిడికి గురై పొరపాటు చేసే ప్రమాదం ఉంటుంది. వచ్చింది ఎవరైనా రోగికి వైద్యం అందిస్తున్నామన్న భావన మాత్రమే ఉండాలి’ అని గుర్తు చేసుకున్న యువ వైద్యుడు.. తండ్రి సలహా మేరకు ఉపన్యాసాన్ని దిగ్విజయంగా కొనసాగించాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821