ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో నిజమైన ఉదాహరణలు కనిపిస్తాయి. గురువులు, స్నేహితులు, అనుచరులు ఎవరైనా అలాంటి పాత్ర పోషించవచ్చు. ఎంతటివారికైనా కొన్ని అనివార్య పరిస్థితుల్లో మానసిక దౌర్బల్యం అధికారం చెలాయిస్తుంది. ఆ సమయంలో స్నేహపూర్వకమైన వ్యక్తుల మాట, నైతిక మద్దతు, మంచితనం చేయూతతో మార్గదర్శనం చేస్తుంది. ఆవేదన మరిపించి తిరిగి కార్యం పట్ల ఉత్సాహం కలిగిస్తుంది. అలా రామాయణంలో రాముడంత టి వాడికి అగస్త్యుడు వివిధ సందర్భాలలో అండగా నిలిచి ప్రోత్సహించిన సంఘటనలున్నాయి. రాముడు వనవాసానికి వెళుతున్నప్పుడు, రావణుడితో యుద్ధం సమయంలో, విజయం అనంతరం అయోధ్య చేరేముందు.. అగస్త్య మహాముని రాముడికి విలువైన మార్గదర్శనం చేశాడు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో రుషులు, మునులు, తపోధనుల కృషి, పాత్ర ఎనలేనిది. అలాంటివారిలో ముఖ్యుడు అగస్త్యుడు. వాల్మీకి రామాయ ణంలో యుద్ధకాండలో రాముడికి ప్రసిద్ధ ‘ఆదిత్య హృదయం’ బోధించింది అగస్త్యుడే. ఉత్తరకాండంలో కొన్ని పూర్వగాథలను వివరించాడు. అలా అగస్త్యుడి పాత్ర సందర్భోచితంగా రామాయణంలో తారసపడుతుంది. అప్సరస ఊర్వశిని చూసి సూర్యుడు మోహితుడై పొందు కోరతాడు. ఆమె సూర్యుడి దగ్గరికి వెళ్తుండగా వరుణుడు అడ్డగిస్తాడు. ఇద్దరికీ వీర్యస్ఖలనం జరుగుతుంది. దానిని జలకుంభంలో దాచుతారు. ఆ కుంభం నుంచి ఇద్దరు పిల్లలు ఉద్భవిస్తారు. వారే వశిష్ఠుడు, అగస్త్యుడు. అందుకే వీరిని కుంభ సంభవులు అంటారు. అగస్త్యుడు లోపాముద్రను పెండ్లి చేసుకుంటాడు. కవేర పుత్రికను మనువాడగా ఆమె కావేరి నదీ రూపాన్ని పొందుతుంది. నిరంతర విజ్ఞాన సముపార్జన, తపోబలం, మేధాసంపత్తితో మహర్షులలో ప్రముఖుడై లోకోపకారుడై దేవతలతో సమానంగా గౌరవ మర్యాదలు పొందినవాడు అగస్త్యుడు.
రావణుడితో యుద్ధంలో దైత్యుల బాణాల ధాటికి తట్టుకోలేక రామచంద్రుడు ఆవేదనతో చింతాక్రాంతుడై కూర్చుంటాడు. అగస్త్యుడు అది గమనించి రాముడిని విష్ణుమూర్తి అవతారమని గుర్తుచేస్తాడు. ఆయనలో ఆత్మైస్థెర్యం నింపుతాడు. రావణుడితో యుద్ధంలో విజయం కోసం ‘ఆదిత్యహృదయం’ ఉపదేశిస్తాడు. కార్య సాధకులకు ఇప్పటికీ ఆ స్తోత్రం 31 శ్లోకాలు పఠనీయంగా ఉండటం విశేషం. ‘ఆదిత్య హృదయం’ ఆరాధనా బలంతో రావణాసురుణ్ని గెలుస్తాడు రాముడు. తర్వాత కుశలవుల జననానంతరం రాముడు అగస్త్యమహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తాడు. రాముణ్ని సాదరంగా ఆహ్వానించిన అగస్త్యుడు, ఆయనకు విశ్వకర్మ రూపొందించిన ఓ దివ్యాభరణాన్ని బహుమానంగా ఇస్తాడు. దానిని శ్వేతుడు తనకు ఇచ్చాడని, తనకోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించే వారికే ఇవ్వాలన్నాడని అగస్త్యుడు చెబుతాడు. దానికి అవతార పురుషుడు, ధర్మమూర్తి అయిన రాముడే అర్హుడని, సహృదయంతో ఆయనకు బహూకరిస్తాడు.
మేరు పర్వతం కన్నా తాను అధికుడనని విపరీతంగా ఎత్తు పెంచుతూ, గర్విస్తున్న వింధ్య పర్వతాన్ని అణచేందుకు అగస్త్యుడు భారతావని దక్షిణానికి వచ్చి, మళ్లీ వెనక్కి వెళ్లలేదన్నది పురాణ గాథ. అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య కవచం, ఆదిత్య స్తోత్రాలెన్నో భారతీయ వాజ్మయంలో ప్రజల నోళ్లలో ఉన్నాయి. ప్రతి మనిషికీ ఇలా ఉండాలని ఆదర్శంగా చూపించే వ్యక్తిత్వం కలిగిన రామచంద్రమూర్తికే మార్గదర్శనం చేసిన అగస్త్య మహాముని చిరస్మరణీయుడు.
–మాడుగుల నారాయణమూర్తి
94411 39106