‘సుఖశాంతులతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అని పిల్లలను పెద్దలు దీవిస్తూ ఉంటారు. సుఖం, శాంతి అనేవి అందరూ కోరుకునేవే. అయితే, ఇందులో ప్రతీ జీవి.. మనుష్య ఉపాధిలో ఉన్నదైనా, ఇతర పశుపక్ష్యాదుల రూపంలో ఉన్నదైనా మొదటగా కోరుకునేది సుఖం. అది ఇంద్రియాల ద్వారా లభిస్తుంది. ‘సుఖశాంతులతో వర్ధిల్లండి’ అనే దీవెనలో సుఖం మొదటగా ఉండొచ్చు. అయితే, భగవద్గీత ఈ విషయంలో ఒక అద్భుతమైన రహస్యాన్ని మానవాళికి అందించింది. ‘అశాన్తస్య కుతః సుఖం’ అన్నది శ్రీకృష్ణభగవానుని పరమోత్కృష్టమైన ప్రశ్న. ‘శాంతి లేకుండా సుఖం ఎలా కలుగుతుంది?’ అని ప్రశ్నిస్తాడు. గీతానుసారం ‘శాంతిసుఖాలతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అనడం సరైన ఆశీర్వాదమవుతుంది.
ఇంతకీ శాంతి కలగాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు భగవద్గీత చక్కని మార్గదర్శనం చేసింది. మనిషి శాంతి పొందాలంటే ఏం చేయాలో, దానికి అతనికి కావలసిన అర్హత ఏమిటో కూడా శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి (భగవద్గీత 4-39)
‘దివ్యజ్ఞానానికి అంకితమైనవాడు, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. దాన్ని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు’ అని ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానాన్ని పొందినవాడు అతి శీఘ్రంగా పరమశాంతిని పొందుతాడని అర్థమవుతున్నది. ఇక శాంతిని పొందినవాడికి సుఖం నిశ్చయంగా కలుగుతుంది. కేవలం శ్రద్ధావంతుడే జ్ఞానప్రాప్తికి పాత్రుడనే సత్యాన్ని కూడా భగవద్గీత స్పష్టంగా తెలియజేసింది. అందుకే ఆధ్యాత్మిక జీవన సౌధానికి దివ్యజ్ఞానం ద్వారం వంటిదని శ్రీమద్భాగవతంలో కపిల భగవానుడు తెలియజేశాడు. విశ్వాసం కలిగినవాడే శ్రద్ధావంతుడు. దివ్యజ్ఞానంపై పూర్తి నమ్మకం ఉన్న అతనికే పూర్తి ఇంద్రియ నిగ్రహం సాధ్యపడుతుంది. అతడే పరమశాంతిని శీఘ్రంగా పొందుతాడు. అందుకే, భగవద్గీత ద్వారా మనిషి జ్ఞాన సముపార్జన చేయాలి. దానిద్వారా అతనికి పరమశాంతి లభిస్తుంది. అదే అపారమైన సుఖాన్ని కలుగజేస్తుంది.
దక్షిణాఫ్రికా ఒకప్పటి అధ్యక్షుడు, నల్లసూరీడుగా పేరున్న నెల్సన్ మండేలా దాదాపు 27 ఏండ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. రోజంతా కారాగార సిబ్బంది ఆయనతో ఎంతో శారీరక శ్రమ కలిగించే పనులు చేయించేవారట. ఇలా చేయడం వల్ల ఆయన శారీరక, మానసిక ైస్థెర్యం కోల్పోతారని భావించారు జైలు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు శారీరక సుఖం పూర్తిగా దూరమైంది. శ్రమ తీవ్రమైంది. కానీ, ఆయనలోని శాంతి మాత్రం తరగలేదు. మండేలాతో పాటే జైల్లో కారాగార శిక్ష అనుభవించిన భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ఆయనకు భగవద్గీతను పరిచయం చేశాడు. వాళ్లిద్దరూ రాత్రివేళలో గీతాజ్ఞానం గురించి చర్చించేవారట. దివ్యమైన గీతాజ్ఞానం మండేలాను ఎంతగానో ప్రభావితం చేసింది. భరింపరాని శారీరక శ్రమ కలిగినా శాంతిని కోల్పోలేదాయన. జైల్లో ఉన్న సమయంలో ఆయన గీతా శ్లోకాలెన్నో కంఠస్థం చేశారట. ఆ తర్వాతికాలంలో ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడు కావడం, రాచమర్యాదలు పొందడం, శాంతిదూతగా ప్రపంచ ప్రఖ్యాతి కావడం తెలిసిందే. గీతా సందేశం జ్ఞాన సముపార్జన చేయడమే. దాని ద్వారా పరమశాంతి లభిస్తుంది. శాంతి పొందడం అంటే పరమ సుఖం పొందడమే కదా! ఇదే భగవద్గీత మానవులందరికీ అందించిన, అందిస్తున్న సుఖప్రాప్తి సాధన మార్గం!
డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్
98219 14642