నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్
(భగవద్గీత 2-66)
మానవ జీవితంలో మనశ్శాంతికి మిక్కిలి ప్రాముఖ్యం ఉన్నది. మనశ్శాంతి కోల్పోయిన వాని జీవితం దుర్భరం. అందుకే ప్రతి మనిషీ మనశ్శాంతి కోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనో నిగ్రహం కలిగి ఉండటమే ప్రధానమ’ని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి పడుతుంది. ఆత్మచింతన, ఆత్మనిష్ఠ కూడా సాధ్యం కాదు. ఆత్మచింతన లేని వానికి శాంతి ఉండదు. శాంతి కరువైన వారికి సుఖమెట్లా కలుగుతుంది?’ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏ వ్యక్తికైనా సుఖం కావాలి అనుకున్నప్పుడు అతనిలో తప్పక ఆత్మ సంయమనం అవసరం. అది కోరుకునేవారికి బుద్ధి నిశ్చలత ఉండాలి. నిశ్చల బుద్ధి ఉండాలంటే మనస్సును నిగ్రహించుకోగలిగే సంయమనం కావాలన్న ఈ సందేశం ప్రపంచంలోని ప్రతి మనిషికీ అవసరమే! మానవులందరూ శాంతిని కలిగి ఉన్నప్పుడే ‘విశ్వశాంతి’ సాధ్యమవుతుంది.
అశాంతి నుంచి మనిషి విడివడాలంటే మనిషిలో నిగ్రహశక్తి ఉండాలి. కనుక జీవితంలో ఎటువంటి కష్టసుఖాలు వచ్చినా తన మానసిక బలంతో వాటిని తాను అధిగమించాలన్న భగవద్గీత బోధనలో తాత్పర్యం స్థిరచిత్తత కావాలన్న దే కాని మరొకటి కాదు. స్థితప్రజ్ఞతకు స్థిరచిత్తం పునాది అన్న భావాన్ని కూడా భగవద్గీత బోధిస్తుంది. మనోనిగ్రహం లోపించడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి. ముందుగా బుద్ధి వికటిస్తుంది. బుద్ధి వికటిస్తే ధ్యానం కష్టం. చాంచల్యం వల్ల బుద్ధి మనిషిని పతనం దిశగా నడిపిస్తుంది. అది శాంతికి విఘాతం కలిగిస్తుంది. కనుక జీవితమంతా అశాంతిమయమై దుఃఖ భాజనమవుతుంది. దానివల్ల పరమానందస్థితికి అవరోధం కలిగి పరమాత్మను చేరుకునే దారి మూసుకుపోతుంది. జీవుడు దేవుణ్ని చేరాలన్న సంకల్పం వికల్పం అవుతుంది.
ఇంతకు ముందే స్వామి మనశ్శాంతి వల్లనే దుఃఖాలకు దూరమై పరమాత్మా న్వేషణలో మనిషి పురోగమిస్తాడని బోధించి ‘స’ కారాత్మక దృష్టిని తెలిపాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ‘న’ కారాత్మక దృష్టిని, దాని పర్యవసానాన్ని అర్జున ముఖంగా లోకానికి తెలియపరిచాడు. వారివారి మానసిక స్థాయిని అనుసరించి మానవులు దీన్ని గ్రహిస్తారన్నది గీతాచార్యుని బోధనానిపుణతగా భావించాలి.
ఆత్మజ్ఞాన సాధకునికి పట్టుదల ముఖ్యం. పట్టుదలనే మనవాళ్లు అభినివేశంగా చెప్పారు. ఆ అభినివేశం లేనివాడే ‘అయుక్తుడు’ అన్నాడు స్వామి. అంటే అయుక్తుడైన వ్యక్తికి ఆత్మజ్ఞానార్జన విషయంలో పట్టుదల ఉండదు. అందుకే పట్టుదలతో ఆత్మస్థానం సాధించాలన్న ఏ వ్యక్తికైనా వాంఛలు తగ్గాలి. వాంఛా నివృత్తి నిగ్రహానికి రహదారి. అది లేని సందర్భంలో అత్మభావన సాధించడం సాధ్యం కాదు. అందుకే ఆత్మభావన లేని వాడు అయుక్తుడన్న సత్యాన్ని స్వామి బోధించాడు. అయుక్తుడైన వానికి అశుద్ధమైన బుద్ధి ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఏమాత్రం ఉండదు. మనస్సు సంశయాల పుట్టగా మారి నిజం తెలుసుకోగలిగే మార్గం నుంచి అతణ్ని దూరం చేస్తుంది. అంటే విషయ తృష్ణ మనల్ని అన్ని సుఖాల నుంచి దూరం చేస్తున్నదన్న మాట యథార్థం.
శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రస్తావించిన ‘సుఖం’ లౌకిక ‘సుఖం’ కాదు. అటువంటి సుఖం తాత్కాలికమే. ఇక్కడ పేర్కొన్న సుఖం నిత్య సుఖం. అదే ఆత్మసుఖం. తత్వదర్శనమైన తర్వాత కలిగే సుఖం. అందుకే ఆత్మజ్ఞానం లోపించడం వల్ల కలిగే దుఃఖం మనకు శాశ్వత సుఖాలను దూరం చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునితో ‘సుఖం కావాలంటే శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే ఆత్మభావన కావాలి. అది రావాలంటే ప్రసన్న చిత్తం అవసరం. దానికి మూలం ఇంద్రియ నిగ్రహం. అదే మనోనిగ్రహం’ అని సుబోధకంగా చెబుతూ జ్ఞానమార్గాన్ని దర్శింపజేశాడు.
గన్నమరాజు గిరిజామనోహరబాబు
99490 13448