‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.
శుద్ధలక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ సరస్వతీ
శ్రీర్లక్ష్మీ ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నమమ సర్వదా
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే॥
అంటున్నది శ్రీ సూక్తం. ‘శ్రీ’ అంటే లక్ష్మీదేవి. సూక్తం (సు+ఉక్తం) అంటే, ‘బాగుగా చెప్పబడిందని’ అర్థం. ‘శ్రీ’ని వర్ణించి చెప్పేది శ్రీ సూక్తం. పై మంత్రాల్లో లక్ష్మీనామంతో పాటు సర్వమంగళ, గౌరి, సరస్వతి నామాలున్నాయి కదా. అష్టలక్ష్ములలో ‘విద్యాలక్ష్మి’ సరస్వతీ సూచకం. ‘వీరలక్ష్మి’ పార్వతిని సూచిస్తుంది.
బ్రహ్మ సృష్టిని చేస్తాడు. బ్రహ్మ చేసిన సృష్టిని కాపాడే పని విష్ణువుది. కాలం తీరిన సృష్టిని లయించే కార్యక్రమం శివునిది. ‘సృష్టి, స్థితి, లయ’లు అన్నవి పనులు. పనిచేయడానికైనా, చేసిన పని లక్ష్యాన్ని సాధించాలన్నా శక్తి కావాలి. ఆసక్తికరంగా ఉండాలన్న ఉద్దేశంతో మన మహర్షులు ఆయా శక్తులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పత్నులుగా చెప్పారు. సరస్వతి ఇచ్ఛాశక్తి. సరస్వతి లేకుంటే బ్రహ్మకు సృజన చేయాలన్న కోరిక పుట్టదు. లక్ష్మీదేవి జ్ఞానశక్తి. ‘జీవించడమెలా’ అన్న జ్ఞానాన్ని విష్ణుమూర్తి మానవులకు లక్ష్మీదేవి సాయంతోనే ఇస్తున్నాడు. ఒక పదార్థ స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చివేయడమే లయమవుతుంది. శివుడు మూడవ కన్ను తెరిస్తే చాలు, ఎదురుగా ఉన్న వస్తువు తన ప్రస్తుత రూపాన్ని కోల్పోయి బూడిద రూపాన్ని పొందుతుందన్న మాట. శివునికి పార్వతి నుంచి లభిస్తున్న దాని పేరు ‘క్రియాశక్తి’.
చరాచర ప్రకృతిలో ఏ పని జరగాలన్నా, ఏ మార్పు సమకూరాలన్నా, ఏ ప్రయోజనం సిద్ధించాలన్నా శక్తి అవసరమవుతుంది. ఆ శక్తి స్వరూపం ఒక్కటే కానీ నెరవేరే పనిని బట్టి, ఆ పనిని నెరవేర్చే దేవతగా ఒకే శక్తికి వేర్వేరు పేర్లను స్థిరపరిచారు మహర్షులు. ‘మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి’ అన్నవి నాలుగు ప్రధాన శక్తి రూపాలని చెప్తారు. మహేశ్వరి సూచనల మేరకు మిగిలిన ముగ్గురూ తమ తమ పనులు నిర్వర్తిస్తారు. ముగ్గురి మధ్య సమన్వయాన్ని సాధించడమే మహేశ్వరి చేసే పని. ఈ విషయాన్ని బమ్మెర పోతనామాత్యుడిలా చెప్తున్నారు- అమ్మల గన్న యమ్మ (ఆ మల గన్న యమ్మ) అంటే, పర్వతరాజ పుత్రిక ముగురమ్మలకు మూలపుటమ్మ, చాల పెద్దమ్మ. రాక్షసుల తల్లి కడుపులో చిచ్చు పెట్టిన అమ్మ. తనను నమ్మిన దేవతల తల్లి మనస్సులో నిలిచి ఉండే అమ్మ. ఆవిడ పేరు దుర్గ. దుర్గమమైన కష్టాల నుంచి మానవులను కాపాడే అమ్మ.
తల్లి కష్టసుఖాలు సంతానంపైన ఆధారపడి ఉంటాయి. దుర్మార్గుడిని దుర్గాదేవి శిక్షిస్తుంది. అతడి తల్లి దుఃఖిస్తుంది. సన్మార్గుడిని దుర్గాదేవి రక్షిస్తుంది. అతడి తల్లి ఆనందిస్తుంది. ‘ముగురమ్మల మూలపుటమ్మ మనకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇచ్చి రక్షించాలని’ ప్రార్థిస్తున్నాడు మహాకవి పోతన. ఇందులో మహత్వం మహాకాళి, కవిత్వం మహాసరస్వతి, పటుత్వం మహాలక్ష్మి. అమ్మలందరూ కలగలిసి మహేశ్వరి. మహత్వ, కవిత్వ, పటుత్వాలలో ఏది కొరవడినా మానవుని జీవితం అసంపూర్ణమే కదా!
-వరిగొండ కాంతారావు 94418 86824