దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః॥ (భగవద్గీత 2-49)
మానవుడికి సమత్వ బుద్ధి అత్యవసరం. ఆ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ సకామ కర్మ కన్నా మిక్కిలి శ్రేష్ఠమన్న లక్ష్యంతో శ్రీకృష్ణు డు అర్జునుడితో ‘ధనుంజయా ఎప్పుడైనా, ఏ పనైనా ఫలాపేక్షతో నిర్వర్తిస్తే అది బుద్ధియోగం కన్నా తక్కువ స్థాయిదే అవుతుంది. అదే కర్మను ఫలాపేక్ష రహితంగా చేసినప్పుడు, చేసిన వ్యక్తి బుద్ధియోగాన్ని ఆశ్రయించే అవకాశం సులభమవుతుంది. ఫలాసక్తితో కర్మను చేసేవారు కృపణులుగా (లోభి) మిగిలిపోతారు’ అని చెప్పడం ఏ కర్మ చేసినా దానిని నిష్కామంగా చేసే మార్గంలో సాగాలన్నది స్వామి బోధనలోని సారాంశం.
మనిషి దైన్యానికి ప్రధాన హేతువు ఫలాపేక్ష అన్నది శాశ్వత సత్యం. సాధారణంగా ఫలాసక్తి వల్ల పలు భయాలు మనల్ని చుట్టుముడుతా యి. వాటివల్ల సమత్వ బుద్ధికి అవరోధం కలుగుతుంది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాటకు ఫలాసక్తి కారణమవుతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆశ మనిషిని దుర్మార్గాలు చేయడానికి పురిగొల్పే ప్రమాదం ఉంది. అసలు ఆశ అనేది మనిషి అంతరంగంలో ప్రవేశిస్తే ఎన్ని ఉన్నా లేనట్లే అనిపిస్తుంటుంది. దానివల్ల బుద్ధి వక్రమార్గం పడుతుంది. చాలాసార్లు ఆశ సఫలం కానప్పుడు నిరాశ మనిషిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుంది. నిరాశ వల్ల నిస్పృహ ఆవరించి, బుద్ధి లోపం ఏర్పడి కర్తవ్య నిర్వహణను మరిచి మనిషి ప్రవర్తన అసహజ ధోరణిలో పడిపోయి మూఢత్వం ఏర్పడుతుంది. అటువంటి వారే లోభులు అని శ్రీకృష్ణుడు ప్రవచించాడు. ఈ విషయంలో మానవ ప్రవర్తన ఒకసారి దారి తప్పినప్పుడు ఆ వ్యక్తి కృపణుడై తన జీవితాన్ని దుఃఖమయం చేసుకునే అవకాశాలే ఎక్కువ.
బుద్ధిని ఆశ్రయించిన వారికి భయాలు, ఆందోళనలూ ఉండవు. బుద్ధిని ఆశ్రయించాలనుకునే వ్యక్తికి ఫలాసక్తి నుంచి దూరమై నిష్కామ కర్మ చేయగలిగే పరిణతి రావాలి. అందుకోసం సాధన చేయడమే కర్తవ్య నిర్వహణగా భావించాలి. అందుకు తగినట్టుగా ప్రవర్తించాలి. అప్పుడే బుద్ధియోగం వికసిస్తుంది. ఈ బుద్ధియోగం కారణంగా పాపపుణ్యాలు అంటవు. తాను చేస్తున్న కర్మ ఫలితం భగవంతుడి అధీనమైనదే కాబట్టి, ఫలాసక్తిపై వాంఛలు పెంచుకోరాదన్న విషయాన్ని భగవద్గీత అనేక శ్లోకాల్లో బోధిస్తూనే ఉన్నది. ‘ధనంజయ’ అనే సంబోధన ఇంతకు పూర్వ శ్లోకాల్లోనూ కనిపిస్తుంది. ఇందులో అర్జునుడు శాశ్వతమైన (అక్షయమైన) ధనాన్నీ అందుకోవాలన్న ధ్వని కూడా వినిపిస్తుంది.
కర్మను ప్రారంభించక ముందే కర్మఫలాన్ని గురించి ఆలోచించడం ప్రయోజనకరం కాదు. ఒక్కోసారి అది వ్యతిరేక ఫలితం ఇచ్చేలా మారవచ్చు. అర్జునుడి కర్త వ్యం శత్రువులతో యుద్ధం చేయడం. అది బాధ్యత. దాన్ని విస్మరించడం పాండవులకు అపజయం ప్రాప్తించడమే కాక, అధర్మం విజయం సాధించే అవకాశంగా పరిణమిస్తుంది. దానివల్ల భగవంతుడైన శ్రీకృష్ణుడి అవతార లక్ష్యం కూడా తారుమారవుతుంది. అందుకే నిష్కామంగా ఆలోచించి కార్యం ప్రారంభిస్తేనే బుద్ధియోగం ప్రాప్తమవుతుందని ప్రకటించాడు శ్రీకృష్ణుడు. అప్పుడే ధర్మగ్లానికి (ధర్మానికి జరుగుతున్న హానికి) అడ్డుకట్ట పడుతుంది. అందుకే నిష్కామకర్మ సర్వశ్రేష్ఠం, విజయకారకమై శోభిల్లుతుంది.
సకామ కర్మలు భోగైశ్వర్య ప్రసక్తితో ముడిపడి ఉండి బంధ హేతువులై మోక్షాపేక్షకు మనిషిని దూరం చేస్తాయి. ఇది నికృష్టమై, శ్రేయో భంగమై, చిత్తనైర్మల్యాన్ని కలుషితం చేస్తాయి. ఈ ఆలోచనలతో సాగితే ధర్మహాని కలుగుతుంది. కాబట్టి విధిగా నిష్కామ కర్మ దిశగానే మానవ ప్రస్థానం ఉండాలని విశిష్ట బోధ చేసిన భగవద్ వచనాలు శిరోధార్యాలు. విశ్వ శ్రేయస్సుకు ఆధారాలు.
గన్నమరాజు గిరిజామనోహరబాబు