శాస్త్ర వివరణల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం! కరోనా వైరస్ ఉద్ధృతి, జనజీవన సమస్యలు, తీవ్రమైన పోటీకి తోడు అసలేం జరుగుతున్నదో, ఏం జరుగబోతున్నదో అన్న ఆతృత సమాజంలో కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఇవేవీ ఆశ్చర్యకరమైనవి మాత్రం కాదు! ఇటువంటివి గతంలోనూ సంభవించాయి, ప్రస్తుతం సంభవిస్తున్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి.
ఐదు వేల ఏండ్ల కిందట ఇదే తరహాలో భావోద్వేగాలకు లోనైన అర్జునుడిని ఉద్ధరించడానికే ఉద్భవించింది భగవద్గీత. అత్యంత పరాక్రమశాలి, రణరంగ ధీరుడైన అర్జునుడంతటివాడు సైతం కురుక్షేత్ర సంగ్రామ ఆరంభంలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేపోయాడు. రథంలోనే కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని విరమింప నిర్ణయించి, తన వాదనను సమర్థించుకునే వాదనలూ వినిపించాడు. పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక తాను ఆచరించవలసిన విద్యుక్త ధర్మాలనూ వీడి ఎక్కడికో పారిపోయేలా కొన్ని సందర్భాలు ప్రేరేపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితి అర్జునుడి లాంటి యోధునికే తప్పలేదు! అర్జునుడి మాటలను విన్న కృష్ణుడు ‘అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున’ (భ.గీ. 2.2)-‘ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి నీకు ఎలా దాపురించింది? గౌరవనీయ వ్యక్తికి ఇది తగదు. ఇది ఉత్తమ గతులకు దారితీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది’ అంటూ హితవును బోధిస్తూ కొనసాగిన సంభాషణే ‘భగవద్గీత’గా విశ్వవిఖ్యాతమై నిలిచింది.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో అస్త్రశస్ర్తాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం జీవితంలో ఎదురయ్యే ఆతృత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనటానికి ఇదే నిదర్శనం. అందుకే శ్రీకృష్ణుడు ‘ఎంతో విలువైన జీవిత సత్యాలను అర్జునుడికి ఉపదేశించాడు. తద్వారా, ఉన్నత జీవన విధానం పట్ల అర్జునుడికి ఉన్న అపోహలను మార్చేశాడు.
సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, కానీ, ఈ భౌతిక దేహాలలో బందీలై జీవిస్తున్నారనే సత్యాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. తానే సర్వకారణ కారణుడని, పరమ సత్యమని గ్రహించి, ఎటువంటి స్వార్థ ప్రయోజనాల్లేకుండా తనను సేవించడమే ప్రతి జీవాత్మ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాబట్టి, జీవన పోరాటాల నుంచి పలాయనం చేయమని భగవద్గీత బోధించదు. శ్రీకృష్ణుడిని శరణువేడి జీవన పోరాటాన్ని కొనసాగించమనే ప్రోత్సహిస్తుంది.
అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారాయన్నది సుస్పష్టం. అయితే, అర్జునుడు పొందిన భావోద్వేగ స్థితి ప్రస్తుత పరిస్థితులతో పోల్చిచూస్తే, వ్యక్తులు అంతర్గతంగా ఎలాంటి మార్పూ చెందలేదని స్పష్టమవుతున్నది. కేవలం బాహ్యంగా మాత్రమే మానవుడు మార్పు చెందాడు. వాస్తవానికి, అప్పటికన్నా మరిన్ని రెట్లు అధికంగానే ఆతృత, ఆవేదన నేటి సమాజంలో అపాయకర స్థితికి చేరాయి. ఇటువంటి పరిస్థితుల్లో భగవద్గీత అవసరం ఎంతైనా ఉన్నది. అంతర్గత బలహీనతలను అర్జునుడు భగవద్గీత ద్వారా ఏ విధంగా ఛేదించుకోగలిగాడో, అదేవిధంగా ప్రస్తుత ప్రపంచానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుందన్నది నిర్వివాదం.
ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించి తమ జీవితాలను శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా తీర్చిదిద్దుకోవాలి. ఐదేండ్ల వయసు నుంచే పిల్లలకు గీతా శ్లోకాలు నేర్పించాలి. అర్థం వివరించాలి. చిన్నారులను విలువలతో కూడిన, సంస్కారవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో గీత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. భగవద్గీత సారం, శ్రీకృష్ణుడిపై అంకితభావం జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేర్పుగా వ్యవహరించగల మనోధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. హరే కృష్ణ!
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984