ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీధుల్లోకి చేరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిం చారు. అందరూ.. కొత్త సంవత్సరం రాకతో తమ జీవితాల్లోనూ కొత్తగా ఏదైనా జరగాలని ఆశిస్తారు. విశ్వంలో జరిగే ఏదో పరిణామం తమ జీవితాల్లో వెలుగు లు నింపుతుందని భావిస్తారు. కానీ, ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్న మానసి క దృక్పథం తప్ప ఈ తేదీ నాడు విశ్వంలో జరిగే ప్రత్యేక పరిణామాలంటూ ఏమీ ఉండవు. అలాంటి సానుకూల పరిణామాల నుంచి ప్రయోజనం కోరుకు న్నవారైతే, ‘మకర సంక్రమణం’ అందుకు సరైన రోజు. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం సాగించే మొట్టమొదటి రోజు సంక్రాంతి. ఆనాటి నుంచే ‘ఉత్తరాయ ణం’ మొదలవుతుంది.
సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం, ఉత్తర దిశగా ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. రెండు అయనాలు కలిస్తే మనకు ఒక సంవత్సరం. భూమిపై ఒక ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. ఉత్తరాయణం దేవతలకు పగలైతే, దక్షిణాయనం రాత్రి. ఈ ఉత్తరా యణ పుణ్యకాలం గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ‘పరబ్రహ్మాన్ని తెలుసుకున్న బ్రహ్మవిదులు అగ్నిదేవుడి ప్రభావం నందు, కాంతియందు, పగటి పూట శుభఘడియల్లో, శుక్ల పక్షంలో, సూర్యుడు ఉత్తరంగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ లోకాన్ని వీడటం ద్వారా ఆ పరబ్రహ్మాన్ని పొందుతారు’ (భగవద్గీత 8-24) అని పేర్కొన్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు దీనిపై వివరణ ఇస్తూ, ‘ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదించినవారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలరు’ అన్నారు. అంటే, ముక్తి మార్గాన్ని సుగ మం చేసే ఘడియలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో మొదలవు తాయి.
విశ్వంలో సంభవించే ఈ శుభ సంక్రమణాన్ని ఒక ఉత్సవంగా జరుపుకొనే సంప్రదాయం మనది. అదే ‘సంక్రాంతి’ పండుగగా చేసుకుంటున్నాం. శ్రీ చైతన్య మహాప్రభువుల వారు సన్యాస దీక్షను స్వీకరించింది సంక్రాంతి రోజే. ఈ పండుగను పట్నవాసులు, పల్లెజనాలు సంబురంగా జరుపుకొంటారు. చేతికి అందిన పంటలతో కర్షక కుటుంబాలు దైవానికి రకరకాల నైవేద్యాలు సమర్పిం చుకుంటాయి. స్థితిమంతులు పేదలకు దానధర్మాలు చేస్తారు. మరికొందరు తమ పితృదేవతలకు పిండప్రదానం చేసి వారి రుణం తీర్చుకుంటారు. పుణ్యాల పంటను పండించే ఉత్తరాయణ కాలాన్ని ఉత్తమ సాధనతో ముక్తికి సోపానంగా మార్చుకోవాలి.
సంక్రాంతి పండుగకు అనుబంధంగా వచ్చే భోగి, కనుమలు కూడా భగవత్ సంబంధమైనవే.. శ్రీకృష్ణుడే తన సర్వస్వమని, ఆరాధ్య దైవమని భావించిన గోదాదేవి ధనుర్మాస వ్రతం భోగితో పరిసమాప్తి అవుతుంది. ఆమె భక్తివిశ్వా సాలకు ముగ్ధుడైన స్వామి గోదాదేవిని పరిపూర్ణంగా కటాక్షించిన రోజు భోగి. గోదాదేవి, రంగనాథ స్వామి పరిణయోత్సవంతో వైష్ణవ ఆలయాలు శోభిల్లు తాయి. గోదాదేవి ధనుర్మాసంలో ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని ముప్పయి రోజులు ఆచరించలేని వారు, ఉత్తరాయణ పుణ్య కాలంలోనైనా శ్రీహరిపై మనసు నిలిపి తిరుప్పావై పాశురాలను గానం చేయాలని శాస్ర్తాలు చెబుతున్నా యి. సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ నాడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవులను, వ్యవసాయంలో వెన్నుదన్నుగా నిలిచిన పశువులను పూజించి రైతులు కృతజ్ఞత చాటుకుంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఇదేనని కొందరు చెబుతారు. సనాతన సంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని గుర్తుచేసే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పండుగ ను ఆనందోత్సాహాలతో జరుపుకొందాం.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984