భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ‘శ్రీమద్భగవద్గీత’ మనకు ఎనలేని ఉపకారం చేస్తున్నది. మానవ సమాజంలో కోటానుకోట్ల సంవత్సరాలుగా ఇది వ్యాప్తిలో ఉండటం విశేషం. ‘భగవత్తత్వం’ అంటే భగవంతుని గురించిన సంపూర్ణ సత్యజ్ఞానం. భగవంతుడు సర్వజ్ఞుడు, సంపూర్ణుడు. అతనిని గురించి మనంతట మనమే తెలుసుకునే అవకాశం లేదు. అది అసాధ్యం కూడా. కాబట్టే, స్వయంగా భగవంతుడే తన గురించి ప్రపంచానికి చాటిచెప్పాడు. ‘భగవద్గీత’లోని ఈ రహస్యాలను అర్థం చేసుకోగలగడమే మనముందున్న కర్తవ్యం.
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥
భగవద్గీత (7.1)
‘ఓ పృథాకుమారా! మనస్సును నా యందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగసాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకోగలవో ఇప్పుడు విను’. భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం స్వయంగా భగవంతుడే ‘భగవద్గీత’లో ఇస్తూ, ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. నిజానికి భగవంతుడనే పదం ఐశ్వర్యం, శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే వాటిని సంపూర్ణంగా కలిగినవాడిని సూచిస్తుందని చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరు తమకు తోచినవిధంగా భగవంతుని గురించి ఊహించుకుంటున్నారే గానీ భగవంతుని నుంచే నేరుగా వినడానికి ప్రయత్నించడం లేదు. దివ్యమైన భగవద్గీత ద్వారా మనిషి భగవత్తత్వాన్ని ప్రామాణికంగా అర్థం చేసుకోగలిగే అవకాశం మనకుంది. దీన్ని పొందగలిగిన వ్యక్తి తన చుట్టూ ఉన్న భగవద్విభూతుల వైభవాలను అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాడు. నిజానికి ఈ జగత్తులో సర్వత్రా నిండి ఉన్న భగవంతుని వైభవమే భగవద్విభూతులు.
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్
భగవద్గీత (10.41)
‘సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు అంశ నుంచి ఉద్భవించినవే’. అంటే, ఈ జగత్తులో ఏదైనా అపారమైన మహిమ కలదిగా లేదా అందమైందిగా కనిపిస్తే దానిని శ్రీకృష్ణుని విభూతి అంశరూపంగానే అర్థం చేసుకోవాలి. అసాధారణంగా సంపన్నవంతమైంది ఏదైనా కృష్ణ విభూతికి ప్రాతినిధ్యమనే గుర్తించాలి. ఈ సందర్భంలో మనం స్త్రీల దివ్యగుణాలను గమనిద్దాం. అవి ఈ జగత్తులో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో గమనిస్తే, ఎందుకు అవి అంతగా అందరినీ ఆకర్షిస్తాయో ఆలోచిస్తే కృష్ణ విభూతికి ప్రాతినిధ్యం కావడమేనని గీత ద్వారా తెలుస్తున్నది.
మృత్యుః సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతామ్
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా॥
భగవద్గీత (10.34)
‘నేను సమస్తాన్ని మ్రింగి వేసే మృత్యువును. జన్మించబోయే సమస్తానికీ నేనే ఉత్పత్తి కారణాన్ని. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యం, మనోహరమైన వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, దృఢత్వం, ఓర్పు నేనే’. ఇందులో స్త్రీల ఏడు దివ్యగుణాలను తెలుపుతూ, అవన్నీ తానేనని శ్రీ కృష్ణభగవానుడు ‘భగవద్గీత’లో పలుకడం గమనార్హం. అవి ఎంతటి ప్రభావాన్ని కలిగి ఉన్నాయో, ఎంతగా మనుషులను ఆకర్షిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. మెట్టినింటికి యశస్సు తెచ్చేది స్త్రీయే, ఐశ్వర్యాన్ని కలిగించేది కూడ స్త్రీయే. స్త్రీ సర్వత్రా ఆదరణను పొందడం వెనుక ఉన్న రహస్యమిదే. స్త్రీల దివ్య గుణాలన్నీ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు సర్వాకర్షకుడు కనుకే, అలాంటి దివ్యగుణాలున్న స్త్రీలంతా అందరి మన్ననలూ పొందుతారు.