Dussehra | కాంతి శక్తి! శాంతి శక్తి! సృష్టి సమస్తం శక్తి అధీనం! ఆ శక్తి అచ్చంగా పరాశక్తి స్వరూపమే!! త్రిమూర్తులకు శక్తినొసగిన మూలశక్తిని ఆసక్తిగా కొలుచుకునే సందర్భం దసరా నవరాత్రులు. అమ్మను నవ రూపాల్లో ఆరాధిస్తూ..నవశక్తిని సంతరించుకుంటాం..
దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని లలితా సహస్రనామ పారాయణతో, కుంకుమార్చనలతో కొలిచిన వారికి కొంగుబంగారమై కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దేవీనవావరణ అర్చనలతో, చతుష్షష్టి పూజలతో నియమ నిష్ఠలతో దేవీ ఆరాధన వైభవంగా జరుపుకొంటారు. ఏ శక్తి సకల సృష్టి, స్థితి, లయాలకు, సమస్త చైతన్యానికి మూలమో ఆ శక్తినే దివ్యంగా ఆరాధిస్తారు.
యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః సకల చరాచర సృష్టికి మాతృరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారం. ఈ సృష్టికి మూలం అమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దేవీరూపమే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పరాత్పరి రూపం. దేదీప్యమానమైన రూపమే దేవీ రూపం. అది కాంతి ప్రవాహం. దేవి అనుగ్రహమే ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా దర్శనమిస్తుంది. ఇచ్ఛ అంటే కోరిక. ఆ కోరికను నెరవేర్చే విధానమే జ్ఞానం. నెరవేర్చే పనే క్రియ. ఈ మూడింటిని సక్రమంగా నిర్వహింపజేయాలంటే తల్లి అనుగ్రహం ఉండాలి. అఖండ కాంతి అమ్మవారి ఇచ్ఛ. దేవి అవ్యక్త స్వరూపమే కాంతి. అదే తేజస్సు. ఆ తేజస్సే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సృష్టి, స్థితి, లయ కార్యాలను అప్పగించింది. పరబ్రహ్మ స్వరూపిణిగా తల్లి ఈ పనులు నెరవేర్చడానికి శక్తిని ప్రదానం చేస్తూనే తాను కూడా భాగస్వామిని అయింది. సమస్త సృష్టికీ మూలశక్తి అయిన అమ్మవారిని ఆరాధించే అద్భుత సందర్భం దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయ దశమి వరకు దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
శరదృతువులో జరుపుకొంటాం కాబట్టి దేవీ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శరత్కాలం ప్రశాంతతకు నిలయం. తెల్లగా మెరిసే మేఘాలు, చంద్రుని తెల్లని వెన్నెల ఈ రుతువుకు ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. అతిశీతలం, అతివేడిమి కాని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది ఈ కాలంలో! వర్షరుతువు ఫలితంగా సరస్సులు, చెరువులు, నదులు జలకళతో కనువిందు చేస్తుంటాయి. శరత్కాలం స్వచ్ఛతకు సంకేతం. దేవీ ఆరాధనకు అనువైన సమయం. ఈ ప్రశాంత సమయంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుచుకుంటాం.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠంకాత్యాయనీతి చ
సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామ్యా బ్రహ్మణైవ మహాత్మనా॥
ఇలా మొత్తంగా తొమ్మిది రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇందులో మొదటి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిగా అమ్మను కొలుస్తారు.
శైలపుత్రీ నమోస్తుతే
హిమవంతుని కూతురైన పార్వతి శైలపుత్రీదేవి. సర్వదా భక్తవాత్సల్య పరిపూర్ణ అయిన ప్రకృతే ఆదిశక్తి. ఆవిడే పార్వతీదేవి. సకలశక్తి సమన్విత, ధర్మార్థ కామ మోక్షప్రదాయిని అయిన శైలపుత్రీ అమ్మవారు కొలువు ఉండే పర్వత ప్రాంతమంతా ఔషధమయం. ప్రకృతిలోని ప్రతీ అణువూ ఈ అమ్మలోనే తాదాత్మ్యం చెందుతుంది. ఈమె నయనాలు సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రులు కాలానికి సంకేతం కనుక కాలస్వరూపిణి అయిన శైలపుత్రీదేవి సర్వదేవతా స్వరూపిణిలా పూజలు అందుకుంటుంది.
పట్టుదలకు సంకేతం బ్రహ్మచారిణి
బ్రహ్మచారిణి.. శక్తికి ఆకృతియైన ఈ దేవి నిత్యతపో ముద్రాంకిత. పరమేశ్వరుని భర్తగా కోరి తపస్సు చేసి, తపః ఫలాన్ని పొందింది. పట్టుదలకూ, కృషికీ సంకేతం ఈ అవతారం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పోరాడి ఫలితాన్ని పొందాలనే భావన బ్రహ్మచారిణి అవతారంలో కనిపిస్తుంది. ఈ రూపంలోని దేవిని ఆరాధించిన వారికి ఏకాగ్రత, పట్టుదల అలవడతాయని శ్రుతి వచనం.
చల్లని తల్లి చంద్రఘంట
చంద్రఘంట.. అమృత భరితమైన దేవి. ఆ అద్భుత రూపమే చంద్రఘంట అవతారం. శిరస్సున చంద్రుడిని ధరించి తన బిడ్డలపై చల్లని వెన్నెల కురిపిస్తుందీ తల్లి. స్వచ్ఛమైన తెల్లని రూపంతో శాంతిని ఉద్బోధిస్తుంది. సకల సంతోషాలు ప్రశాంతతలోనే ఉన్నాయని సందేశాత్మకంగా వివరిస్తుందీ రూపం. భక్తితో ఈ తల్లిని ఆరాధించే వారికి తన చల్లని కరుణామృత చూపులతో శాంతి సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది.
బ్రహ్మాండం కూష్మాండ దుర్గ
ఆధ్యాత్మిక పరిభాషలో కూష్మాండం అంటే బ్రహ్మాండం అని భావన ఉన్నది. ఈ సకల లోకాలను తన దరహాసంతో సృజించిన తల్లి కూష్మాండ. సర్వశుభాలనూ ప్రసాదించే కల్పవల్లి ఆమె. సకల ప్రాణికోటి శారీరక, మానసిక రుగ్మతలను పారదోలి శుభాలను చేకూర్చుతుంది. కూష్మాండ రూపంలో దుర్గను ఆరాధిస్తే సమస్త దోషాలూ పరిహారం అవుతాయనీ, తనను కొలిచేవారిని సమర్థులుగా తీర్చిదిద్దుతుందని విశ్వసిస్తారు. శరదృతువు ప్రాణాలకు కష్టకాలం అని పురాణోక్తం. ఈ రుతువులో చెడును ఎదుర్కొనే శక్తి, సర్వశుభాలనూ వర్షించే వరాలు ఇవ్వమని కుష్మాండ దుర్గను కోరుకోవాలి. ఆ తల్లి అభయప్రదాయినియై కరుణిస్తుంది.
విశ్వజనని స్కందమాత
ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి. ఆ దేవత అమ్మగా కనిపించే అద్భుతమైన రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఈ రూపంలో శ్వేతవర్ణంలో కుమారస్వామిని లాలిస్తూ దర్శనమిస్తుంది. తన బిడ్డలందరిపై అమృతాన్ని కురిపిస్తూ అభయం ప్రసాదిస్తుంది.
కల్పవల్లి కాత్యాయని
సింహవాహనంపై కరవాలం చేతబూని దుష్టసంహారకారిణిగా, జగద్రక్షణిగా విరాజిల్లుతుంది కాత్యాయని అవతారం. పార్వతీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని కాత్యాయన మహర్షి తపస్సు చేశాడు. ఆయన అభీష్టం నెరవేర్చిన అమ్మవారు కాత్యాయనిగా రూపుదాల్చింది. ఆదిశక్తి అయిన దుర్గాదేవికి కాత్యాయని, కన్యాకుమారి అని పేర్లు. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి మనుషులను ఉద్ధరింపజేస్తుంది.
ఉగ్రరూపిణి కాళరాత్రి
ప్రపంచానికి వాటిల్లిన ఉపద్రవం నుంచి మానవాళిని ఉద్ధరించడానికి అవతరించిన దేవిగా కాళరాత్రిని భావిస్తారు. నల్లని రంగులో అభయహస్తంతో గార్దభ (గాడిద) వాహనంపై లోకభీకర రూపంలో సాక్షాత్కరించింది కాళరాత్రీదేవి. ఆమె వాహనం కూడా కాలమేఘంలా దర్శనమిస్తుంది. నలుపు రంగులో శోభిల్లే ఈ కాళరాత్రి అవతారాన్ని ఆరాధిస్తే చెడు తొలగి సకల శుభాలూ వర్షిస్తాయి. ఆకలితో అల్లాడే దీనులకు శాకంబరిగా శాకపాకాల్ని అనుగ్రహించే చల్లని తల్లి.. ధర్మ పరిరక్షణ కోసం కాళరాత్రిగా భయంకర రూపంలో దుష్టశిక్షణ చేస్తుంది.
మంగళ ప్రదాయిని మహాగౌరి
ఆదిపరాశక్తి భయంకరమైన కాళి స్వరూపాన్ని విసర్జించి ఆకృతిదాల్చిన చల్లని రూపం మహాగౌరి. ధవళకాంతితో వెలిగిపోయే వృషభంపై స్వచ్ఛమైన తెల్లని ఛాయతో మంగళ స్వరూపిణిగా మహాగౌరి అవతరించింది. ధన, వైభవ శక్తులకు ఈ తల్లి అధిదేవత. భక్తుల అభీష్టాలను నెరవేర్చి సకల సంతోషాలను అనుగ్రహిస్తుంది. మంగళకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. గౌరీదేవి దర్శనంతో మనసులో కల్మషం తొలగిపోయి నిర్మలమైన భావన కలుగుతుంది.
అభీష్ట ఫలదాయిని సిద్ధిధాత్రి
అష్టమి నాడు మహాగౌరిగా కనిపించే అమ్మవారు మహర్నవమి రోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది. ఈమె వాహనం సింహం. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత ఈమె. సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి. ఈ తల్లిని కొలిచిన వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. లౌకిక, అలౌకిక సిద్ధులూ సిద్ధిస్తాయి. ఇహ సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుందీ దేవత.
…? మరుమాముల దత్తాత్రేయ శర్మ
9441039146