పెందుర్తి : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. రుషికేష్లో ఉన్న శ్రీశారదాపీఠంలో గురుపూర్ణిమ సందర్భంగా వీరిరువురూ ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగనున్నది. స్వామీజీకి ఇది 26వ దీక్ష. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతికి నాలుగోది.
చాతుర్మాస దీక్షా కాలంలో స్వామీజీలు ఎలాంటి పర్యటనలు చేపట్టరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను తీసుకోరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు అన్నదానం నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. దీక్షా కాలంలో పీఠానికి పరంపరానుగతంగా వచ్చిన గురువులను స్వామీజీలు నిరంతంర స్మరించుకుంటారు. ఆది శంకరుని శంకరభాష్యాన్ని, ప్రస్థానత్రయ భాష్యాన్ని పఠిస్తూ పరమ పవిత్రంగా దీక్షను కొనసాగిస్తారు. నిత్యం పీఠాధిపతులు తమ స్వహస్తాలతో గంగానదికి హారతులిస్తారు.
గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తర్వాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేస్తారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్కు వెళ్తుంటారు. సెప్టెంబరు 20న చాతుర్మాస్య దీక్ష ముగిసేంత వరకు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలు రుషికేశ్లోనే ఉంటారు. దీక్షా కాలంలో వినయక చవితి, కృష్ణాష్టమి వేడుకలను ఆశ్రమంలోనే జరుపుతారు.