తిరుపతి జిల్లా : తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఈ నెల 9వ తేదీన ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపడతారు. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును అర్చక బృందం ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరుపుతారు. ఈ ఉత్సవానికి సంబందించిన మరో నమ్మకం కూడా ఉన్నది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారని పెద్దలు చెప్తుంటారు.