కోరమీసాలతో కొలువైన దేవుడు కొమురవెల్లి మల్లికార్జునుడు. కొండల్లో వెలసిన ఈ చల్లని దైవాన్ని మల్లన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు భక్తులు. సంక్రాంతి తర్వాత ఈ క్షేత్రం తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోతుంది. ఐతారం వచ్చిందంటే చాలు కొమురవెల్లి భక్తజన సంద్రంగా మారిపోతుంది. వారవారం ఒక్కో ప్రాంతానికి చెందిన భక్త పరివారం మల్లన్న సన్నిధిలో పట్నం వేసి సంబరపడతారు. ‘కోరమీసాల దేవుడికి కోటి దండాలు.. కొమురెల్లి మల్లన్నకు శతకోటి దండాలు..’ అని గొంతెత్తి పరవశిస్తారు. శివరాత్రి వేళకు ఈ సందడి పదింతలు అవుతుంది. మల్లన్న పెండ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది.
మల్లన్న ఆలయానికి ఆరున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిసినట్టు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తున్నది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మలేగావ్ ప్రాంతంలో ఖండోబా (మల్లికార్జునస్వామి) ఆలయం ఉంది. పూర్వం అక్కడి పూజారికి స్వామి కలలో వచ్చి తాను కొమురవెల్లి గుహలో వెలిశానని చెప్పాడట. ఆయన భక్తులతో వచ్చి చూడగా.. ఇక్కడి కొండల్లో శివలింగం కనిపించిందట. కొంత కాలానికి శివలింగంపై పుట్ట పెరిగిందనీ, అదే పుట్టమట్టితో మాలేగావ్లోని ఖండోబా రూపాన్ని పోలిన విధంగా కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి విగ్రహాన్ని నిర్మించారని అర్చకులు చెబుతారు. మట్టితో మలిచినప్పటికీ శతాబ్దాలు గడుస్తున్నా స్వామివారి విగ్రహం చెక్కుచెదరకపోవడం విశేషం.
పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించిన పౌరాణిక ఘట్టానికి ప్రతీకగా మల్లికార్జునుడి పాదాల చెంత ముగ్గురు రాక్షసుల తలలు కనిపిస్తాయి. అందుకే మల్లికార్జునుడిని శివుడిగా భావించి పూజలు చేస్తారు. పరమేశ్వరుడికి పార్వతి, గంగ వలె మల్లికార్జునుడికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ ఇనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరి విగ్రహాలనూ మల్లన్న సన్నిధిలో చూడొచ్చు. గుట్టపై ఎల్లమ్మ గుడి, ఆంజనేయస్వామి, వీరభద్రుడి ఆలయాలు ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు పట్నం (ముగ్గు) వేయడం, బోనం సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ.
శివరాత్రికి కల్యాణం
మల్లన్న క్షేత్రంలో రెండు రకాల పూజా విధానాలు కొనసాగుతున్నాయి. మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు ఒగ్గు పూజారుల సంప్రదాయం ప్రకారం పాటలు పాడుతూ స్వామివారికి కల్యాణోత్సవం జరిపిస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి కొమురవెల్లిలో మహాశివరాత్రి సంబురం మొదలవుతుంది. ఆనాటి నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వరకు పట్నం ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో ఒక ఆదివారం హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చి పట్నం వేసి మల్లన్నకు మొక్కులు చెల్లిస్తారు. దీనిని పెద్ద పట్నం అంటారు. మరో ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. ఆ రోజు సికింద్రాబాద్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దపట్నం వేస్తారు.
ఉగాది ముందు వచ్చే ఆదివారం అగ్ని గుండాలు ఏర్పాటుచేసి అత్యంత భక్తిశ్రద్ధలతో వాటిని దాటుతారు. ఇక స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టు ఏడాదంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ చెట్టు ఆకును తిన్నవారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే మల్లన్న విగ్రహం నుదుటన అలంకరించిన బండారు (పసుపు)ను తింటే రోగాలు నయమవుతాయని నమ్ముతారు.
ఇలా చేరుకోవచ్చు
హైదరాబాద్ నుంచి కొమురవెల్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట, కరీంనగర్ వెళ్లే బస్సు ఎక్కి రాజీవ్ రహదారిపై ఉండే కొమురవెల్లి స్వాగత తోరణం దగ్గర దిగాలి. అక్కడినుంచి ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి వచ్చే భక్తులు జనగామ, చేర్యాల మీదుగా కొమురవెల్లి వెళ్లొచ్చు. శివరాత్రి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
…? తుంగ పవన్కుమార్