శ్రీశైలం : సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం భ్రమరాంబమల్లిఖార్జున స్వామిఅమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో రెండోరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం పండితులు, అర్చకులు యాగశాలలో చండీశ్వరస్వామికి జపాలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, మండపారాధన తదితర పూజాధికాలు నిర్వహించారు. సాయంకాలం ప్రదోషకాలంలో హోమాలు, జపానుష్టానాలు జరిపించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకరమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై వేంచేపు చేసి.. ప్రత్యేక చేశారు. ఆ తర్వాత పుష్పార్చన తదితర క్రతువులు జరిపారు. అనంతరం ఆలయ మాఢవీధుల్లో భృంగి వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రీతిపాత్రులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాపులు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ప్రాకారోత్సవంలో కార్యనిర్వాహణాధికారి లవన్న, ఏసీ నటరాజ్, ఈఈ మురళీ బాలకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, ఫణీంద్ర ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, పర్యావేక్షకుడు శ్రీహరి, మల్లికార్జున రెడ్డి, అయ్యన్న, రవి, చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సామూహికంగా భోగిపండ్లు
హిందూ సాంప్రదాయ సనాతనధర్మంలో భాగంగా నేడు భోగి పండుగను సాంప్రదాయబద్దంగా నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. కార్యక్రమంలో ఐదు సంవత్సరాల్లోపు వయసున్న చిన్నారులకు సామూహికంగా భోగిపండ్లు పోయనున్నట్లు చెప్పారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకున్నవారితో పాటు భక్తుల పిల్లలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. భోగిపండ్లు పిల్లలకు బాలారిష్టదోషాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు తెలిపారు.
కుమారస్వామికి కృత్తికా నక్షత్ర పూజలు
దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాధికాలను సర్కారీ సేవలుగా నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని పంచామృతాభిషేకాలు, షోడష పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కొలువు చేసిన దత్తాత్రేయుడికి విశేష పూజలు జరిగాయి. త్రిఫల వృక్షం కింద తూర్పు ముఖంగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పాభిషేకాలు, ఫలోదకాభిషేకాలు చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన త్రిమూర్తి అవతారుడైన దత్తాత్రేయునికి పూజలు జరిపించడంతో లోకశాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.