Brahmotsavam | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా
సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమీతంగా మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపైకి వేంచేపు చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు.
తొలుత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం క్రతువు చేపట్టారు. సందర్భంగా ఉపనిషత్తు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలను పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించారు.
వేడుకలో ఏలకులు, వట్టి వేరు, పిస్తా, చందనం, నల్ల ద్రాక్ష, పసుపు కొమ్ములు, రోజ్ పెటల్స్, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. స్నపన తిరుమంజనం వేడుకల సందర్భంగా టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించగా.. మలయప్ప స్వామివారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపూర్, సేలం దాతలు మాలలను విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.