తిరుపతి : నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 13 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మే 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 12న అంకురార్పణం జరుగుతుందని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలను వారు తెలిపారు.
13 న ధ్వజారోహణం పెద్దశేష వాహనం, 14న చిన్నశేష వాహనం హంస వాహనం , 15న సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం , 16న కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారని పేర్కొన్నారు. 17న మోహినీ అవతారం గరుడ వాహనం, 18న హనుమంత వాహనం గజ వాహనం, 19 న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం , 20న రథోత్సవం జరుతుందని, 21న చక్రస్నానం ధ్వజావరోహణం నిర్వహించ నున్నామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని వివరించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ. వెయ్యి చెల్లించి పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, ఒక లడ్డు, వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు.