ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు. తన శిష్యులకు తనపట్ల ఎంతటి భయభక్తులో చూడమని ఇతరులతో గర్వంగా చెప్పేవాడు. ఇలా ఉండగా ఒక రోజు గురువు కాలువ మీద వెళ్తూ కాలుజారి, ప్రవాహంలో పడ్డాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న శిష్యులు గురువు నీళ్లల్లో పడటం చూసి పరుగు పరుగున కాలువ దగ్గరికి వెళ్లారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న గురువు.. చేతులు ఆడించడం వారికి కనిపించింది. గురువు గారు ‘నమస్కారం చేయడం లేదేమి?’ అని అడుగుతున్నారని భావించి అందరూ వంగి వంగి నమస్కారాలు చేయసాగారు.
ఆ దారిన వెళ్తున్న గ్రామస్థుడు ‘మనిషి కొట్టుకుపోతుంటే అలా నమస్కారాలు చేయడం ఏంటి? అతణ్ని కాపాడే ప్రయత్నం చేయండి!’ అన్నాడు. అందుబాటులో ఉన్న తాడు గురువుకు అందేటట్లు విసిరారు శిష్యులు. దాన్ని పట్టుకొని ‘బతికానురా భగవంతుడా!’ అనుకొని ఒడ్డును సమీపించాడు గురువు. ఆయన దగ్గరవ్వడంతోనే నమస్కారం చేయకపోతే తిడతాడని భయంతో తాడు వదిలేసి మళ్లీ నమస్కారాలు పెట్టారు శిష్యులు.
పట్టు తప్పడంతో మళ్లీ నీళ్లల్లో పడ్డాడు గురువు. ఇంతలో గ్రామస్థుడు తాడును అందుకొని ఆయన్ను బయటికి లాగాడు. ప్రాణభిక్ష పెట్టిన గ్రామస్థుడికి ధన్యవాదాలు చెప్పాడు గురువు. తన కఠిన వైఖరి వల్ల శిష్యులు అలా ప్రవర్తించారని గురువుకు అర్థమైంది. సమయం, సందర్భం లేకుండా తు.చ. తప్పకుండా తన మాటలు పాటించడం వల్ల ప్రాణాల మీదికి వచ్చిందని గ్రహించాడు. మితమే హితమనీ, అతి ఎప్పటికైనా అనర్థదాయకమని గురువుతోపాటు శిష్యులూ తెలుసుకున్నారు.
…?కృష్ణస్వామి రాజు,9393662821