గీతావాక్యం
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః!
(భగవద్గీత 6- 1)
‘కర్మ ఫలాన్ని ఆశ్రయించక, కర్తవ్య కర్మలను ఆచరించేవాడే నిజమైన సన్న్యాసి.. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలం అగ్నికార్యాలను, క్రియలను త్యజించినంత మాత్రాన సన్న్యాసి, యోగి కానేరుడు’ అన్నాడు గీతాచార్యుడు.
సన్న్యాసం అంటే కర్తవ్య కర్మలను త్యజించి, సోమరులై, బాధ్యతలను విస్మరించి ముక్కు మూసుకొని కూర్చోవడమో, కాషాయాలను కట్టడమో కాదు. భౌతిక వ్యాపారాలకు దూరంగా దేశదిమ్మరులై సమాజానికి భారంగా పరిణమించడమూ కాదు. ఇవన్నీ డాంబికమైన బాహ్యాచారాలు మాత్రమే.
ఆయా పనులన్నీ ‘నేనే’ చేస్తున్నానే అహంభావంతో, ఆ కార్య ఫలితాలకు తానే కర్తననే భావనతో ఆనందాన్నో, దుఃఖాన్నో పొందడం అంతకన్నా కాదు. అలాకాక ప్రాకృతికమైన కార్యాల నిర్వహణలో తానొక ఉపకరణాన్ననే భావనతో కర్తవ్యాన్ని నిష్ఠతో, ఉపాసనా భావనతో నిర్వహించడం సన్న్యాసం. ఫలితాన్ని అపేక్షించకుండా నిబద్ధతతో కార్యాలను నిర్వహించే వాడే యోగి. బాహ్యమైన వ్యవహారాలతో పాటు ఆంతరంగికంగా కూడా ఫలాపేక్షను విడిచి కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించేవాడే నిజమైన కర్మయోగి.
ఒక వక్త తాను చెప్పిన అంశంపై కాక శ్రోతల స్పందనలకు మాత్రమే పరిమితమైనా.. ఒక ఆటగాడు అందరూ మెచ్చుకోవాలని ఆశించి ఆడినా.. ప్రతిభావంతంగా తమ పనిని నిర్వహింపలేరు. చేసే పనిపైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఇతరుల మెప్పును లేదా తిరస్కృతిని పట్టించుకోక పోవడమే కర్తవ్య నిర్వహణగా చెప్పుకోవాలి. ఒక సంస్థను నిర్వహించే వ్యక్తి ఆ సంస్థ నియమానుసారంగా తన కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహించాలే కాని ఇతరులు ఏమనుకుంటారోననే భావనతో కాదు. దీని వల్ల నాకేమిటి ప్రయోజనం అనే భావనతో పనిచేస్తే.. ఆ వ్యక్తి ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోలేడు.
ప్రక్రియ ఆధారంగా కర్తవ్యాన్ని నిర్వహించడం ‘పరాప్రకృతి‘గా చెప్పుకుంటాం. అదే ఫలితం ఆశించి నిర్వహిస్తే ‘అపరాప్రకృతి’. ఇది వ్యక్తిలోని కనీసస్థాయిగా చెప్పుకోవాలి. ఫలితంపై కాక పనిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించిన వ్యక్తి అంతశ్చేతనలోని శక్తిసామర్ధ్యాలు జాగృతమై అద్భుత ఫలితాలు ఆవిష్కృతం అవుతాయి. ‘నేను’, ‘నాది‘ అనే భావనలు అదృశ్యమవుతాయి. అందుకే ధర్మాచరణ, ఫలితాపేక్ష లేకుండా కర్మాచరణ కలిగిన వారే నిజమైన సన్న్యాసి, యోగి అని భగవద్గీత చెపుతుంది.
కర్మఫలాలను ఆశించకుండా
కర్మాచరణ వల్ల ప్రేరణ ఉంటుందా? సాధారణమైన సందేహమే ఇది. సమాజానికి ప్రయోజనాన్ని కలిగించే పనులు చేసినప్పుడు తప్పని సరిగా ఫలితం ఆశించినా, ఆశించకపోయినా వస్తుంది. స్వార్థ చింతనలో బాధలు కలుగుతాయి. ఫలాపేక్షతో చేసే కర్మలో ఆ ఫలితం అందకపోతే దుఃఖం, అందితే సుఖం కలుగుతుంది. ఈ సుఖదుఃఖాలు మనసుకు సంబంధించినవి కాబట్టి అది రాగద్వేషాలకు మార్గం చూపుతుంది.
…? పాలకుర్తి రామమూర్తి