‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే ఆ చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమాత్ముడే అనుమంత’గా, అంటే ‘అనుమతించేవాడి’గా పేర్కొన్నారు. ఆత్మ చైతన్యం మన దేహమంతా వ్యాపించి ఉంటుంది. కాగా, పరమాత్ముని పరమ చైతన్యం ప్రతి జీవిలోనూ వ్యాపించి ఉంటుంది. ఆ విధంగా హృదయంలో ఉండే పరమాత్ముడే సాక్షిగా, అనుమతించేవాడిగా, భోక్తగా, మహేశ్వరునిగా వర్తిస్తాడని ‘భగవద్గీత’ చెబుతున్నది.
‘ఫలానా కార్యం జరగదేమో’ అని పదేపదే అనుకుంటుంటే హృదయంలో ఉండే పరమాత్ముడు అనుమతించేవాడు (తథాస్తు) అనుకున్నట్లుగానే కార్యం బెడిసి కొడుతుంది. అలా కాకుండా, ‘ఫలానా కార్యం జరిగి తీరుతుంది’ అని పదేపదే పలకడం ద్వారా హృదయస్థ పరమాత్ముని అనుమతితో అది అనూహ్యంగా నెరవేరుతుంది. ‘ద్వాసుపర్ణా సయుజా సఖాయ’ అని ‘ముండకోపనిషత్'(3.1.1) పేర్కొన్నది. పరమాత్ముడు నిరంతరం ఆత్మతోపాటుగానే ఉండి జీవుడు అనుకున్నవన్నీ తీరుస్తుంటాడు. అందుకే మంచి కోరుకుందాం.. తథాస్తు.. అనుకుందాం!