మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!’- మహాదేవుడు కట్టిన మంగళసూత్రం మీద అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకు- సర్వమంగళకు, ఉన్న నమ్మకం మాట ఎలా ఉన్నా, బమ్మెర పోతన్న మాత్రం పురాతన కాలం నుంచి అధునాతన- వర్తమాన యుగం వరకు సనాతన భారతీయ సంస్కృతిలో ఉత్తమ దాంపత్య ధర్మానికి ఉజ్జల ప్రతీకగా నిలిచిన తాళిపై, భద్రకాళిపై తనమదిలో పదిలంగా నెలకొన్న వమ్ముకాని నమ్మకాన్ని వందనీయమైన పై కమ్మని కంద పద్యంలో ఇమ్ముగ ఇలా శిలాక్షరాలుగా చెక్కాడు.
సూతుడు శౌనకాదులతో.. మహర్షులారా! తపోధన్యాగ్రణి, ధీమణి, బాదరాయణి అయిన శుకముని, పాండవేయుడు పరీక్షిత్తుతో ఇలా పలికాడు- రాజా! దేవతలు, దానవులు చుట్టూ చేరి జయజయ ధ్వానాలు చేయగా దేవదేవుడు నిటలాక్షుడు శివుడు అంతటా వ్యాపించిన కటువైన ఆ కాలకూట విషాన్ని పటుతరంగా చేతితో ఒకచోటికి చేర్చి, కబళం- ముద్దగా చేశాడు. కరతలం- అరచేతిలో పెట్టుకొని జంబూఫలం- నేరేడు పండు, వలె శంభుడు విలాసంగా ఆరగించాడు. విషం వెలుపల ఉన్నా ఉపద్రవమే. లోపల ఉన్నా విపత్కరమే- ప్రమాదమే. కుటిలమైన కాలకూటం బయట ఉంటే బయటి లోకాలకు జటిలమైన సంకటం. సదాశివుని ఉదరం సర్వలోకాలకు సదనం. విషం ఆయన కుక్షిలోకి దిగితే లోకాలన్నింటినీ భక్షిస్తుంది.
అష్టమూర్తి శంకరుని హృదయం తన ఇష్టదైవం- సదయుడైన రఘుశ్రేష్ఠుడు రామచంద్రునికి రమ్యమైన నిలయం. పోనీ, నాలుక మీద నిలుపుకొందామా అంటే దాని మీద నిత్యం రామనామం నర్తిస్తూ ఉంటుంది. అది నామానికే అపచారం. అందుకే ఇందుమౌళి ఆ విషాన్ని పొందికగా ఏదో ఫలరసం వలె తన కంఠబిలం- గొంతులోనే బలంగా నిలుపుకొన్నాడు. గళంలోనే బంధించి గరళకంఠుడు అయ్యాడు. అద్భుత విగ్రహుడు… శూలాయుధుడు, హాలాహలధరుడైనా అమృతస్వరూపుడే! హాలాహల విషానికి జంబూఫలంతో పోలిక వ్యాసభాగవతంలో లేదు.
అమాత్యుడు స్వీకరించిన ఈ ఉపమానం శంకర భగవత్పాదుల ‘శివానందలహరీ’ స్తోత్రంలోని ‘జ్వాలోగ్ర స్సకలామరాతి భయదః’ అనే శ్లోకంలో (కిం పక్వ జంబూఫలం?- అదేమైనా పరిపక్వమైన నేరేడు పండా ఏమి?) కానవస్తుంది. ‘భయంకరమైన ఆ మహావిషం భవుని- శంకరుని ఏమీ చేయలేకపోవటం నిశ్శంక- నిస్సందేహంగా (తవ జనని తాటఙ్క మహిమా!) భవానీ అమ్మ చెవి కమ్మల చలువే!’ అని శంకరాచార్య వచనం.
కం॥ ‘మెచ్చిన మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చిచ్చర చూపచ్చుపడిన శివునకుఁ దక్కన్!’
శుక ఉవాచ.. ‘రాజా! తాను మెచ్చినప్పుడూ, తనకు నచ్చినప్పుడూ ఇతరులకు ఇచ్చ (ఇష్టం) వచ్చినంత ఇవ్వవచ్చు. అంతేకానీ, ఎంత పరోపకారమైతే మాత్రం ప్రజ్వరిల్లుతున్న- భగభగమండే చిచ్చును, మచ్చెకంటి (మీనాక్షి) సతీదేవి ఇచ్చగించింది- ఒప్పుకొన్నది కదా అని లోకాలన్నీ అచ్చెరువొందగా చప్పరిస్తూ మింగటం చిచ్చరకన్ను- అగ్నినేత్రం గల త్రిలోచనుడికి- ముక్కంటికి తప్ప మరెవరికి చేతనవుతుంది? ద్విత్వ (చ్చ) చ కారం పలుమారులు చకచకా పలకడం వల్ల ఈ కందం వీనుల విందుగా ఇంతగా అందగించింది. అన్నీ అచ్చతెలుగు పదాలే కావడం ఇందలి మరో విశేషం. ఇది సహజ పాండిత్యుని స్వీయ పద్యం.
ఆ॥‘హరుఁడు గళమునందు హాలాహలము వెట్టఁ
గప్పు గలిగి తొడవు కరణి నొప్పె
సాధురక్షణంబు సజ్జనులకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!’
‘ఓ రాజా! హరుడు హాలాహలాన్ని మింగకుండా, హేలాగతిని- విలాసంగా కంఠంలో ధరించడం- దాచుకోవడం వల్ల గళం- గొంతు, నల్లబడిపోయింది. అది ఆయనకు కళంకం కాక ఒక అలంకారంగానే అమరింది. అది మొదలు ఫాలాక్షుడు.. కాలకంఠుడు, నీలలోహితుడు అయ్యాడు. ఆలోచించి చూడగా సాధు సంరక్షణం భోళా శంకరుని వంటి సజ్జనులకు ఒక ఆభరణమే కదా అనిపిస్తుంది.’ ప్రమథనాథుడి పలు ప్రసిద్ధనామాలలో ఆయన స్వభావ, ప్రభావాలను ప్రకటించే ‘నీలకంఠ’ నామం ఆయనకు, భక్తులకు ఎంతో ఇష్టమైన విశిష్ట నామం.
భూపాలా! కాలకూట విషాన్ని కాలకాలుడు ఉమాధవుడు తన కుత్తుకలో ధరించడం చూసి మాధవుడు, విరించి (బ్రహ్మ), మృడాని- భవాని, మహేంద్రుడు ‘మేలు-మేలు’ అంటూ మంచి మనసుతో మెచ్చుకొన్నారు.
కం॥‘హాలాహల భక్షణ కథ
హేలాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్
వ్యాళానల వృశ్చికముల
పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై’
‘కోలాహలంగా సాగిన హరుని ఈ లీలామయ హాలాహల భక్షణ కథను, హేలాగతి- శ్రద్ధాభక్తులతో సంతోషంగా విన్న, రాసిన, చదువుకొన్న వారు ఎట్టి భయానికి గురికారు. వారికి సర్ప, అగ్ని, వృశ్చికాల (తేళ్ల) వల్ల కష్టాలు కలుగవు’ అని ఈ ఘట్టానికి విస్పష్టంగా తనదైన ఫలశ్రుతి పలికాడు మన పోతన! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006