TTD news | ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం 7 నుంచి 13 వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది. హైదరాబాద్కు చెందిన నాగరాజు బృందం కార్యక్రమం మొదట్లో “ఎంతో రుచిరా.. చివర్లో ‘వీరమారుతి గంభీర మారుతి..’ భజన కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పారాయణం చేయడంతో తిరుమల గిరులు రామనామ స్మరణతో మార్మోగాయి. బాలకాండ అఖండ పారాయణంలో 61 నుంచి 65 సర్గల వరకు గల 137 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు కే రామానుజాచార్యులు, పీవీఎన్ఎన్ మారుతి తదితరులు శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తోపాటు పలువురు అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.