ఒక ఊర్లో మోతుబరి రైతు దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. తమ ఆస్తినంతా ఏదైనా సత్కార్యానికి వినియోగిస్తే బాగుంటుందని భావించారు. ఊర్లోని గుడి వద్ద అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అతిథులకు ఏ లోటూ రాకుండా సత్ర నిర్వహణ చేసే మంచి హృదయమున్న వ్యక్తి కావాలని అనుకున్నారు. అలాంటి వ్యక్తి కోసం ఊరంతా గాలించారు. దొరకలేదు.
పక్క ఊరిలో దొరుకుతారేమోనని భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. పొద్దు పోయేంతవరకు వెదికినా వారికి నచ్చిన వ్యక్తి దొరకలేదు. ఏమి చేయాలో తెలియక అని ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని చిన్న కుండల వ్యాపారి. అతిథులైన రైతు దంపతులను లోపలికి పిలిచి ‘ఈ రాత్రి మీరు మా ఇంట్లో భోజనం చేయండి’ అని కోరాడు. ఆకలిగా ఉన్న రైతు అందుకు అంగీకరించాడు. ఆ రోజు శనివారం కావడంతో ఉపవాసం ఉన్న రైతు భార్య సున్నితంగా తిరస్కరించి ఆ ఇంట్లో ఓ మూలన కూర్చుంది. కుండల వ్యాపారి భార్య తన భర్తకూ, రైతుకూ కంచాలు తెచ్చిపెట్టింది. కుండల వ్యాపారి వినమ్రంగా, ‘మేము దీపం వెలుతురులో భోజనం చేయమ’ని చెప్పి ఇంట్లోని లాంతరును ఆర్పివేశాడు.
కొంచెం కష్టమైనా రైతు తృప్తిగా భోజనం చేశాడు. పొలం పనులున్నాయని చెప్పి రైతు దంపతులు అక్కడినుంచి బయలుదేరారు. దారిలో రైతు భార్య ‘కుండల వ్యాపారి దంపతులు చాలా మంచివారు. మనం ఆలోచించే అన్నదాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలరు’ అని చెప్పింది. ‘వారి ఆతిథ్యం బాగానే ఉంది కానీ, భోజనం చేసేటప్పుడు దీపం ఆర్పి వేయడం నాకు నచ్చలేదు. అన్నం తినడం నాకు చాలా కష్టమయ్యింది’ అని బదులిచ్చాడు రైతు.
రైతు భార్య నవ్వుతూ ‘వారి ఇంట్లో ఆహారం కొద్దిగానే ఉంది. అది మనకి తెలియడం వారికి ఇష్టం లేదు. అందుకని మీకు కడుపు నిండా భోజనం పెట్టి కుండల వ్యాపారి మాత్రం చాలీచాలని భోజనం చేశాడు. అందుకనే దీపాన్ని ఆర్పి వేశాడు. అతిథి దేవోభవ అనే సూత్రాన్ని అక్షరాలా ఆచరించి చూపించారు’ అని వివరించింది. వాస్తవం తెలిసి ఆశ్చర్యపోయాడు రైతు. ఇద్దరూ వెనక్కి తిరిగి వెళ్లి, సత్రం బాధ్యతలను కుండల వ్యాపారి దంపతులకు అప్పగించారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821