ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం నుంచి అమృత తుల్యమైన కృష్ణ గీతం. ఇలా లయబద్ధంగా సాగే సామూహిక భజన.. తొలి ఏకాదశి సందర్భంగా యోగనిద్రలోకి జారుకుంటున్న వైకుంఠనాథుడికి భక్తులు పాడే జోలపాట! ఆషాఢ శుక్ల ఏకాదశి వేళ సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం పాండురంగ ఆశ్రమంలో కనిపించే సన్నివేశమిది. తెలంగాణ పండరిగా పేరుగాంచిన పాండురంగ ఆశ్రమం 92వ ఆషాఢి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. దశాబ్దాల కిందట తెలంగాణలో భక్తి ఉద్యమానికి నాంది పలికిన యతివర భావానంద భారతీస్వామి నెలకొల్పిన ఆశ్రమంలో జరిగే ఆషాఢి ఉత్సవ వివరాలు మీ కోసం..
పుండరీకుడు తలచిన వెంటనే పలికిన దేవుడు పండరిలో మాత్రమే కాదు పాండురంగ ఆశ్రమంలోనూ ఉన్నాడు. చిరునవ్వులు రువ్వుతూ రుక్మిణీ సమేతుడై దర్శనమిస్తాడు. పండరి దాకా వెళ్లలేని భక్తులు ఆశ్రమానికి వచ్చి స్వామిని దర్శిస్తారు. మెదక్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రత్యేకించి తొలి ఏకాదశికి ఆశ్రమంలో ఆషాఢి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. నాదం (భజన), సాదం (ప్రసాద వితరణ)తో ఈ క్షేత్రం అలౌకిక ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతుంది. ఇందులో పాలుపంచుకోవడానికి కొందరు భజనలు చేస్తూ పాదయాత్రతో ఆశ్రమానికి చేరుకుంటారు. ఇంకొందరు సపరివార సమేతంగా వాహనాల్లో వస్తారు. సనాతన ధర్మానికి కేంద్రంగా, భగవత్ భక్తికి నిలయంగా భాసిల్లే ప్రశాంత నికేతనంలో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష చేసి, ద్వాదశి నాడు స్వామి ప్రసాదంగా భోజనం చేసి తిరుగు ప్రయాణమవుతారు.
పాండురంగ ఆశ్రమంలో కొలువుదీరిన శ్రీవారి దివ్యజగన్మోహన మంగళమూర్తి భక్తుల హృదయ కమలాలలో చెక్కు చెదరకుండా నిలిచిపోతుంది. స్వామివారి మూర్తి కంటికి కనిపించగానే భక్తులు పులకిస్తారు. దశాబ్దాల కిందట తెలంగాణలో భక్తి ఉద్యమానికి ఊపిరులూదిన యతిశేఖరులు శ్రీభావానంద స్వామి, విశ్వనాథ పరమ గురువులు ఇద్దరూ కలిసి తమ పరిపూర్ణమైన తపశ్శక్తిని ధారపోసి ఈ క్షేత్రాన్ని ఆవిష్కరించారు. 1932లో రుక్మిణీ సమేత పాండురంగస్వామిని ప్రతిష్ఠించి ఈ ప్రాంతాన్ని తెలంగాణ పండరిపురంగా తీర్చిదిద్దారు.
తొలి ఏకాదశి పర్వం సందర్భంగా దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వీటినే ఆషాఢి ఉత్సవాలు అని వ్యవహరిస్తారు. ఈ వేడుకను భావానంద స్వామి ‘ఆషాఢి నామక భక్తోత్సవం’ అని పేర్కొన్నారు. అంటే భక్తులందరూ కలిసి చేసుకునే పండుగ ఇది. మూడురోజులపాటు (ఈ నెల 28 నుంచి 30 వరకు) భగవన్నామ సంకీర్తనోత్సవం అఖండంగా జరుగుతుంది. నామ సంకీర్తనమే కలియుగంలో భక్తులకు శరణ్యం. అందుకే ఆషాఢి ఉత్సవాల్లోనే కాక, నిత్యం పాండురంగడి సన్నిధిలో భగవన్నామం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది.
ఆషాఢ శుక్ల దశమి ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనంతో ఉత్సవం ఆరంభమవుతుంది. ఆ వెంటనే భక్త సముదాయం అఖండ భగవన్నామానికి శ్రీకారం చుడుతుంది. అప్పుడు మొదలయ్యే నామ సంకీర్తన ద్వాదశి నాడు అన్నదానం పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. మరోవైపు ఆశ్రమంలోని నాద మంటపం వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏకాదశి రాత్రి ఆశ్రమం పరిసరాల్లో భక్తులంతా గుంపులు గుంపులుగా కూర్చొని భక్తి సంకీర్తనలు గానం చేస్తుంటారు. ఒకచోట ఒగ్గు కథలు, మరోచోట యక్షగానాలు, ఇంకోచోట తత్వగీతాలు, అల్లంత దూరంలో ‘తందనాన రామాయణం’.. ఇలా ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత కొత్త కోణంలో ఆవిష్కృతం అవుతుంది.
ఏకాదశి నాడు ఉపవాసం పాటించిన భక్తులకు ద్వాదశి ఉదయం అన్నదానం నిర్వహిస్తారు ఆశ్రమ నిర్వాహకులు. వేలమంది భక్తులకు సరిపోయేలా అన్నం వండుతారు. రుచికరమైన సాంబారు (ప్రత్యేకం) తయారుచేస్తారు. పరిసర గ్రామాల్లోని రైతులు ఆషాఢి కోసం నెత్తిన ధాన్యం మూటలు, భుజాన కూరగాయలతో ఏకాదశి నాటికి ఆశ్రమానికి చేరుకుంటారు. భగవంతుడు తమకు ప్రసాదించిన ధాన్యాన్ని స్వామి కార్యానికి వితరణ చేస్తారు. ద్వాదశి నాడు శుచిగా స్నానాదులు ముగించుకొని వేలమంది భక్తులు ఆశ్రమ ప్రాంగణంలో వరుసల్లో కూర్చుంటారు. వారందరికీ విస్తరాకులు వేసి చేటల ద్వారా అన్నం వడ్డిస్తారు. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు రంగడి నామాన్ని స్మరిస్తూ తిరుగుప్రయాణం అవుతారు.
‘త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర॥’ అన్నట్లుగా ‘ఓ దేవదేవా! పాండురంగస్వామీ! నీవు ఇచ్చిన వస్తువులనే మోసుకొని, తెచ్చి నీకు సమర్పిస్తున్నామయ్యా! వీటిని ప్రేమతో స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు స్వామీ!’ అనే పవిత్రమైన భావంతో సమర్పించే భక్తజనుల భావపరంపరను మనం ఏమని కొనియాడగలం?
మదునూరి వెంకటరామశర్మ: 78931 42535