ఒక ఆశ్రమంలో గురువు, గురుపత్ని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. గురుపత్నికి ఓ అనుమానం వచ్చి ‘స్వామీ ఈ లోకంలో ప్రశాంతంగా జీవించేవారు ఎవరు?’ అని భర్తను అడిగింది. దానికి ఆయన ‘నీ దృష్టిలో ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో చెప్పు’ అని అడిగాడు. దానికామె ‘సర్వం ఎరిగినవారు మీరే చెప్పాలి’ అంది.
‘ముందుగా నీ అభిప్రాయం వెల్లడించు’ అన్నాడు గురువు. ‘మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా! పుష్కలంగా ధనం ఉన్నవాళ్లే! వారి కోరికలు అన్నీ తీరుతాయి. ఏ సమస్యా లేకుండా ఉంటారు. అలాంటి వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు’ అని బదులిచ్చింది గురుపత్ని. దానికి గురువు నవ్వి ‘నీ ఊహ తప్పు దేవీ! ధనం పాపిష్టిది. దాని కోసం ఎందరినో నమ్మించి, ద్రోహం చేయాల్సి వస్తుంది. లౌకికమైన కోరికలు డబ్బుతో తీరుతాయి.
రోగాన్నీ డబ్బుతో నయం చేసుకోవచ్చు. కానీ, ఎంత డబ్బున్నా.. వ్యాధి వల్ల కలిగే బాధను అనుభవించక తప్పదు కదా!’ అని బదులిచ్చాడు. ‘మరి ప్రశాంతంగా ఉండేది ఎవరు స్వామి?’ అని మళ్లీ అడిగింది గురుపత్ని. ‘లాభనష్టాల్లో, సుఖదుఃఖాల్లో భగవంతుణ్ని విస్మరించని వాడే ప్రశాంతంగా జీవించగలడు.
జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులు, దైవం పట్ల ఎవరైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో వాళ్లే ప్రశాంత జీవనం సాగించగలరు’ అని చెప్పాడు. ‘వారికీ కష్టాలు వస్తుంటాయి కదా! ఇక ప్రశాంతత ఎక్కడ ఉంటుంది’ అని అడిగిందామె! ‘ఆ కష్టంలోనూ భగవంతుణ్ని నమ్ముకున్నవాడికి ఏ బాధలూ ఉండవు. సంపదతో కలగని ప్రశాంతత భగవత్ సాన్నిధ్యంతో లభిస్తుంది’ అని వివరించాడు గురువు.
…? కనుమ ఎల్లారెడ్డి, 93915 23027