ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. శయన ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఈ వ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ప్రస్తుత కాలంలో సన్యాసులు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు.
అరుదుగా గృహస్థులు కూడా ఈ వ్రతదీక్షలో ఉంటున్నారు. ఒకే పూట భోజనం, బ్రహ్మచర్యం, భూతల శయనం వంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఊరి పొలిమేరలు కూడా దాటకూడదు. చాతుర్మాస్య వ్రతం మానవ జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది. ఆషాఢం నుంచి కార్తికం వరకు ప్రకృతిలో పలు మార్పులు జరుగుతుంటాయి. వర్షాలు కురిసి వాగులూ, వంకలూ నిండుగా ప్రవహిస్తుంటాయి. రకరకాల మొక్కలు పెరిగి పరిసరాలు చీదుగా తయారవుతాయి.
అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఈ కాలంలో ఎక్కువ. అందుకే, పరిసరాల మార్పు వల్ల కలిగే సమస్యలను నివారించడానికి గ్రామ పొలిమేరను దాటకూడదని శాస్త్రం నిర్దేశించింది. ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస్య వ్రతం ఏర్పాటు చేశారని పెద్దలు చెబుతారు. సన్యాసులు ఈ నాలుగు నెలలూ ఒకేచోట దీక్షగా వ్రతం ఆచరిస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ ధ్యానమగ్నులై ఉంటారు.
శ్రీ