శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒక్కటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో సోమవారం ఆరుద్రోత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని వార్షిక ఆరుద్రోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటలకు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి తొలుత గణపతి పూజ నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక లింగోద్భవకాల రుధ్రాభిషేకం, అన్నాభిషేకం ఏకాంతసేవ కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిపారు.
ఇదిలా ఉండగా.. తెల్లవారు జామున 3 గంటలకు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ద్వారాలు తెరచి సుప్రభాత సేవ, మహామంగళ హరతి, స్వామి అమ్మవార్లకు ప్రాతః కాల పూజలు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ముఖ మండపంలో ఉత్తర ముఖంగా వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నంది వాహనంపై ఆసీనులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాడవీధులుల్లో స్వామిఅమ్మవార్ల శోభాయాత్ర జరగ్గా.. భక్తులు అధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఆది దంపతులను స్తుతిస్తూ సంకీర్తనలు ఆలపించారు.