TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. మే మాసానికి సంబంధించిన అంగ్రప్రదక్షిణ టోకెన్ల కోటాను శుక్రవారం (23న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు టికెట్స్ ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రవేశం దర్శనం కల్పించనుండగా.. దర్శనం టికెట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నది. అయితే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసిన వారికి వసతి గదులు కేటాయించనున్నారు. 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.