TTD News | గీతా జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ భగవద్గీత పారాయణం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు కొనసాగింది. ప్రముఖ వేదపండితులు కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాలలోని మొత్తం 700 శ్లోకాలను 4 గంటలపాటు నిరంతరాయంగా పారాయణం చేశారు.
అంతకుముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం మొదట్లో ‘అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో’, చివరగా ‘కృష్ణం వందే జగద్ గురుం’ కీర్తనలను భావయుక్తంగా ఆలపించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని, వేదపండితులు నరసింహాచార్యులు, మారుతి, రామానుజం, రాఘవేంద్రతోపాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.