Satyanarayana Swamy Vratham | ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది? అందుకే, యాదాద్రికి వచ్చిన భక్తులు ఇక్కడ సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధి తర్వాత ఆ స్థాయిలో సత్యనారాయణ వ్రతాలు జరిగే క్షేత్రం యాదాద్రే.
కొండ మీద వ్రతాలు చేసుకోవడం వెనుక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి, ‘నన్ను దర్శించడానికి వచ్చిన భక్తుల హృదయాల్లోని సత్యానికి వశమై వారికి చేయూతనిచ్చి రక్షిస్తాన’ని ప్రమాణం చేసిన పుణ్యక్షేత్రం యాదాద్రి. అందుకే యాదాద్రీశుడికి సత్యదేవుడు, సత్య ప్రమాణ దేవుడు అనే పేర్లు సార్థకమయ్యాయి. స్వామి అవతార సమయంలో నైమిశారణ్యం నుంచి రుషులు యాదాద్రికి చేరుకొని హోమాది క్రతువులు నిర్వహించారని స్థల పురాణం. నరసింహస్వామినే సత్యనారాయణుడిగా భావించి వ్రతాలు కూడా ఆచరించారట. నాటి నుంచి కొండంత దైవం అండగా ఉండాలని కోరుతూ సత్యనారాయణ వ్రతాలు చేసే సంప్రదాయం యుగయుగాలుగా వర్ధిల్లుతున్నది. ప్రతీ సంవత్సరం కొండమీద లక్షకుపైగా వ్రతాలు జరుగుతుంటాయి. అలా తెలంగాణ అన్నవరంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో జరిగే వ్రతంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. శ్రావణం, కార్తిక మాసాల్లో వ్రతాలు భారీ సంఖ్యలో జరుగుతాయి.
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద ఎగ్జిట్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో 2.57 ఎకరాల్లో రూ.17.38 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన సత్యనారాయణ వ్రత మంటపాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ప్రత్యేక మంటపాలు తీర్చిదిద్దుతున్నారు. ఒక మంటపంలో వెయ్యిమంది కూర్చుని ఒకేసారి 250
వ్రతాలు చేసుకునేలా విశాలంగా నిర్మిస్తున్నారు. సిబ్బంది, అర్చకులకు ప్రత్యేక గదులు కూడా కేటాయించారు. త్వరలోనే నూతన సత్యనారాయణ మంటప భవనం అందుబాటులోకి రానుంది.
యాదాద్రిలో మరో ప్రత్యేకత గిరి ప్రదక్షిణ. అరుణాచలం, సింహాచలం క్షేత్రాల్లో మాదిరిగానే యాదాద్రిలోనూ గిరి ప్రదక్షిణ సంప్రదాయం ఉంది. గ్రహచార బాధలు, అనారోగ్యం, దుష్ట గ్రహాల బాధలు ఉన్న భక్తులు నరసింహస్వామి కొలువై ఉన్న కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. స్వామివారి జన్మతార అయిన స్వాతి నక్షత్రం రోజు, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో గిరి ప్రదక్షిణ చేస్తారు. యాదాద్రిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. పంచనారసింహ స్వరూపాలలో ఉగ్రరూపం యాద పర్వతంలో సింహాకృతిలో ఉంటుంది. పవిత్రమైన ఈ గిరికి ప్రదక్షిణ చేస్తే భూదేవికి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం వస్తుందని స్కంద పురాణం చెబుతుంది.
కొండ చుట్టూ ఉన్న వృక్షాల్లో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. త్రేతాయుగంలో ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని లంకకు తీసుకుపోతున్న సమయంలో, ఆ సంజీవరాయుడి ఛాయ కొండపై పడిందని, దీంతో ఇక్కడున్న చెట్లు సంజీవని వృక్షాలుగా మారాయని నమ్ముతారు. పౌర్ణమినాడు బ్రాహ్మీ సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యం బాగుపడటంతోపాటు సకల శుభాలూ కలుగుతాయని చెబుతారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా.. గిరి ప్రదక్షిణ చేసే మార్గాన్నీ అభివృద్ధి చేశారు.దారి పొడవునా ఔషధ మొక్కలను పెంచుతుండటం విశేషం.