ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుని పల్లెవాసుల సహకారంతో గుడి నడపాలి. శిక్షణ పూర్తయ్యే రోజు రానే వచ్చింది. వీడ్కోలు సమావేశంలో అందరికీ కొన్ని గ్రంథాలు, పూజ చేయడానికి కావల్సిన వస్తువులు, దుస్తులు ఇచ్చారు. శిష్యులందరినీ గురువు ఆశీర్వదించాడు. ఓ యువ అర్చకుడు గురువును ‘భక్తులతో ఎలా మెలగాలి?’ అని అడిగాడు. గురువు చిన్నగా నవ్వి అతని చేతికి ఒక అద్దం అందించాడు. దాన్ని దూరంగా ఉంచి అందులో ముఖం చూసుకోమన్నాడు. సరిగ్గా కనిపించలేదు.
ఈసారి అద్దాన్ని ముఖానికి చాలా దగ్గరగా ఉంచి చూడమన్నాడు. అప్పుడూ ముఖం చూడటం కష్టమైంది. నిర్దేశిత దూరంలో ఉంచి ముఖం చూసుకోమన్నాడు. ‘ఇప్పుడు సరిగ్గా కనిపిస్తున్నది గురూజీ’ అన్నాడు శిష్యుడు. ‘అద్దాన్ని మరీ దూరంగా పెట్టినా, దగ్గరగా పెట్టుకొన్నా.. ముఖాన్ని సరిగ్గా చూడలేకపోయావు. నిర్దేశిత దూరంలో ఉంచితే దృశ్యం చక్కగా కనిపించింది. అలాగే భక్తులకు మరీ దూరంగా ఉండొద్దు. అలాగని అతి దగ్గరగానూ ఉండొద్దు. వారికి ఉండాల్సినంత దూరంలో ఉంటే మీకూ మంచిది, వారికీ మంచిది’ అని చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న శిష్యుడు, గురువు ఆశీర్వాదం తీసుకొని అక్కడినుంచి కదిలాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు