తమ ఆయుష్షు పెరగాలనుకునేవారు, తమ సంపదను పెంచుకోవాలని భావించేవారు, దుర్మరణం నుంచి తప్పించుకోవాలనుకునే వారు సిలా రెహ్మీ (బంధువులతో సంబంధాలను నెరవేర్చడం) చేయాలని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (సఅసం). ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మరణ భయం ఇవి మనిషిని నిత్యం వెంటాడుతుంటాయి. ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు మృత్యుముఖంలోకి చేరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలనుకునేవారు… బంధువుల హక్కులు నెరవేర్చాలన్నది ప్రవక్త బోధనల సారాంశం. రక్త సంబంధీకులు, తోబుట్టువులు, ఇతర దగ్గరి బంధువుల హక్కులు నెరవేర్చడంలో అలక్ష్యం చేయరాదన్నది ఖురాన్ హెచ్చరిక.
కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఖురాన్ గ్రంథం మరెన్నో సూచనలు చేసింది. ‘బంధుత్వ సంబంధాల విషయంలో అల్లాహ్కు భయపడండి’ అని ఖురాన్ హెచ్చరిస్తుంది. ప్రళయదినాన్ని విశ్వసించేవారే బంధువుల హక్కులను నెరవేరుస్తారని ఈ పవిత్ర గ్రంథం పేర్కొన్నది. ‘మీ దగ్గరి బంధువుల హక్కును నెరవేర్చండి’ అని ఖురాన్ పదేపదే హెచ్చరించింది. నిరుపేద బంధువుల పట్ల కారుణ్యం చూపాలని, ప్రేమ, వాత్సల్యాలతో మెలగాలని సూచించింది. ‘ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథలు, నిరుపేదలు వస్తే, ఆ ఆస్తినుంచి వారికి కూడా కొంత ఇవ్వాలి’ అని ఖురాన్ ఉద్బోధ. భార్యాభర్తల బంధంతో ఒక్కటయ్యే కుటుంబంలో అన్నా, చెల్లి, భార్య, భర్త ఇతరత్రా బంధుత్వాలు ఏర్పడతాయి. ఈ సభ్యుల కలయికతో ఏర్పడే కుటుంబం పదికాలాలపాటు మనగలగాలంటే బంధువుల హక్కులను నెరవేర్చాలి. బంధువులను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమను వ్యక్తపర్చాలి. నిరుపేద బంధువుల అవసరాలను తీర్చాలి.
‘మీకు రెండు చోట్ల నుంచి విందుకు ఆహ్వానం అందితే అందులో దగ్గరి రక్తసంబంధీకులెవరో వారింటికి వెళ్లండి’ అని చెప్పారు ప్రవక్త మహనీయులు. ప్రవక్తలు, వారి సహచరులంతా తమ బంధువుల హక్కులు చక్కగా నెరవేర్చారు. మనవల్ల ఏదైనా తప్పు జరిగితే బంధువులను మన్నించమని వేడుకోవడంలో ఆలస్యం చేయరాదని, ఎవరైనా మన్నించమని ప్రాధేయపడితే తక్షణం స్పందించాలని ఇస్లామ్ బోధనల స్ఫూర్తి. దీనివల్ల దెబ్బతిన్న బంధుత్వ సంబంధాలు మెరుగవుతాయి. వైరం కారణంగా తమ సోదరుడితో మూడు రోజులకు మించి మాట్లాడకుండా ఉండరాదని ప్రవక్త (స) హెచ్చరించారు. రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటే అల్లాహ్ అనుగ్రహం గగనమే! అలాంటి వారు ఎన్ని దైవారాధనలు, ఉపవాసాలు, హజ్ యాత్ర చేసినా ప్రయోజనం ఉండదని ప్రవక్త బోధనల సారాంశం. బంధువుల పట్ల ప్రేమ, వాత్సల్యం కనబర్చినప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్ఠమవుతుంది. కుటుంబం బలంగా తయారైతే సమాజం పరిపుష్టం అవుతుంది.