అరుణగిరి అచంచలం. ఆ అచలంపై నడయాడిన రమణ మహర్షిదీ దాదాపూ అదే తత్వం. అందుకే, ఎక్కడ చోటు దొరక్క మౌనం ఆ మహనీయుడిని ఆశ్రయించింది. ఆ మౌనానికి ఊరడింపు కోసమో ఏమో ఆయన ఎప్పుడోగానీ మాట్లాడేవారు కాదు. ఆ మాటలు జ్ఞానగుళికలయ్యేవి. సత్యాన్ని బోధించేవి. తత్వాన్ని విశదపరిచేవి. బాధను ఉపశమింపజేసేవి. ఆనందాన్ని కలిగించేవి. మనసును తేటపరిచే ఆ మాటల్లోని కొన్ని అమృత బిందువులు..
తనపై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిస్తే రమణులు ఒప్పుకొనేవారు కాదు. ప్రత్యేకతంటే వారికి గిట్టనే గిట్టదు. దారిలో వెళ్తుంటే.. ఎదురుపడ్డ వాళ్లు తప్పుకోవటం కూడా సహించకపోయేవారు. ముందుగా ఆయనే తప్పుకొని వారిని పోనిచ్చిన తరువాత వారు నడిచేవారు. ఆ సమత్వంలో, ఎదుటివారిని అర్థం చేసుకునే ఆ విశాల హృదయంలో మనం వెయ్యో వంతు అలవరచుకున్నా ధన్యులమే! చాలామందికి మహర్షి సాన్నిధ్యమే ఆధ్యాత్మిక భద్రతనీ, మానసిక సరళతనీ విశ్వాసాన్ని కలిగిస్తుంది.
రమణుల అమృత సమానమైన వాక్కులు ఆత్మాన్వేషణకే కాదు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతాయి. ఎవరైనా ఆత్మన్యూనతతో బాధపడితే భరించలేకపోయేవారు మహర్షి. మానసికంగా కుంగిపోతున్న ఓ భక్తునితో ‘తాను దుర్బలుడననీ, దుష్టుడననీ అనుకోవటమే ప్రతి
మానవుడూ చేసే పెద్ద తప్పిదం. వాస్తవానికి ప్రతి మనిషీ దైవిక సంపన్నుడే, బలాఢ్యుడే! అతని ఆలోచనలు, అలవాట్లు, వాంఛలు, భావాలు’ ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కానేకావు’ అని ఊరడించేవారు.
ఉపవాసాల ప్రాముఖ్యం గురించి ఓ భక్తుడు రమణుల వద్ద ప్రస్తావించాడు. అప్పుడు మహర్షి స్పందిస్తూ ‘ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నిటినీ ఆపేస్తే మనస్సు ఏకాగ్రమవుతుంది. అటువంటి మనసు భగవంతుని మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మనసుకు ఆహారం. వాటిని విడనాడటమే ఉపవాసం! మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వాడు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం కలిగించలేని వారి కోసమే శారీరకమైన ఉపవాసాన్ని నిర్దేశించారు’ అని వివరించారు.
శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువ అవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకి కలిగిస్తుందని ప్రబోధించేవారు. పారమార్థిక జ్ఞాని మానసికస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేస్తూ ‘జ్ఞాని అయినవాడు కూలికి బరువు మోసినట్లే ఈ దేహాన్ని మోస్తాడు. గమ్యస్థానం వచ్చేది ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తాడే కానీ! ఏవో ప్రయత్నాలు చేసి ఈ బరువును ఇంకా మోయాలనుకోడు! సరైన జ్ఞానం కలిగితే, ఈ శరీరం ఎవరికి కావాలి? సదా నిర్మలంగా ఉండే తనకు ఈ మోత బరువెందుకు?’ అంటారు రమణ మహర్షి. వారు కూడా స్వయంగా తమ దేహాన్ని చిరునవ్వుతో త్యజించారు.
ఒకసారి ఆశ్రమ వంటశాలలో అరటిపూలతో కూర వండుతున్నారు. అందులో భాగంగా పూలను తరుగుతూ, వాటి మీద ఉన్న దొప్పలను తీసి గంపలో నింపేస్తున్నారు. ఆ తరువాత వాటిని బయట పడవేస్తారు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నది. రోజువారీ వాహ్యాళిలో భాగంగా రమణులు గోశాల వైపు వెళ్తుండగా అరటిపూల దొప్పలు పడవేయటం గమనించారు. పక్కనే ఉన్న ఓ ఆశ్రమవాసితో ‘అయ్యో! అరటి దొప్పలను ఎందుకు అలా వృథా చేస్తున్నారు. వాటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి’ అన్నారు. అప్పుడు ఆ ఆశ్రమవాసితోపాటు భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ దొప్పలను ఎలా వండాలో అర్థం కాక, అక్కడి వారు ప్రశ్నార్థకంగా ముఖాలు పెట్టారు. అప్పుడు రమణులే స్వయంగా ఆ అరటిపూల దొప్పలను తరిగారు. ఇంగువ, ఎండు మిరపకాయలు తదితర పదార్థాలన్నింటినీ కలిపి చక్కని వంటకాన్ని తయారు చేశారు. ఇంకెప్పుడూ ఈ అరటిదొప్పలను వృథా చేయకూడదని వంటశాల సిబ్బందికి సూచించారు.
కొంచెం కష్టమైనా మహర్షి మాట కాదనలేక వంటవాళ్లు కూర వండారు. అయితే కొన్నాళ్లకు మహర్షి గిరి ప్రదక్షిణ చేసి వస్తూండగా, దూరంగా ఓ చోట గుంతతీసి ఏవో పూడ్చినట్లు నేల కొంచెం ఎత్తుగా కనిపించింది. వెంటనే రమణులు చేతికర్రతో దాన్ని అలా తవ్వినట్లు చేశారు. ఆ గుంతలోంచి అరటిపూల దొప్పలు బయటపడ్డాయి. వాటిని వండే ఓపిక లేక, తనకు కనిపించకుండా ఇలా కప్పిపెట్టారని వారు అర్థం చేసుకున్నారు. ‘అయ్యో! వండకపోయినా కనీసం పశువులకు వేసినా తినేవి కదా!’ అనుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. అంతే! ఇక ఆ తరువాత ఆ మహానుభావుడు వంటశాలలో అరటిపూల ప్రస్తావనే తేలేదు. రమణులు ఏదైనా ఒక్కసారే చెప్పిచూసేవారు. వినిపించుకోలేదంటే తిరిగి బలవంతపెట్టి చేయించే అలవాటు వారికి లేదు. ‘చెప్పటమే మన వంతు, వినటం, విని ఆచరణలో పెట్టటం ఎదుటివారి వంత’ని మహర్షి ఆంతర్యం!
– మనోజ్ఞ