‘పాము కుబుసం విడిచినట్లు’ జ్ఞాని దేహభ్రాంతిని విడిచి పెడుతుంటాడు. ‘నటుడు స్త్రీ వేషం వేసుకొన్నప్పుడు కాని, వేసుకొననప్పుడు కాని పురుషుడే అయి వున్న రీతి’గా శ్రేష్ఠుడైన బ్రహ్మవేత్త సర్వకాల సర్వావస్థలలోను పరబ్రహ్మయే అవుతాడు!
‘అథర్వణ వేదం’లోని ‘ఆత్మోపనిషత్తు’ సర్వాంతర్యామి మూడు రూపాల (బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ)ను వివరించింది. పుట్టుట, గిట్టుట అనే ధర్మాలతో కూడిన చర్మం, మాంసం, రోమాలు, అంగుష్టకాలు, గోళ్లు, ఉదరం, నాభి, మేఢ్రం, కటి, తొడలు, కపాలములు, భూమధ్యం, లలాటం, బాహువులు, శిరస్సు, పార్శాలు, శ్రోత్రాలు, నేత్రాలు వంటివన్నీ ‘బాహ్యాత్మ’గా పేర్కొనబడ్డాయి. రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, కామమోహాలతో కూడిన అనేక అనుభవాలతో, శ్రవణం, ఘ్రాణం చేయువాడై, ఆనందించువాడై, నియంతయై, బోధించువాడై వున్నవానిలో అంతర్గతంగా ఉన్న ఆత్మ ‘అంతరాత్మ’గా చెప్పబడింది. ఇక, ‘పరమాత్మ’ అంటే ఉపాసింపదగినవాడు.
ప్రాణాయామంతో, ప్రత్యాహారంతో, ధారణ, ధ్యానం, సమాధి యోగంతోనే ‘పరమాత్మ’ లభిస్తాడు. ఇతరాలతో ఆ ‘పరమాత్మ’ పొందబడడు. అంతేకాదు, తానుగా జన్మించడు, మరణించడు, శుష్కించబడడు, తడపబడడు, దహింపబడడు, కదిలింపబడడు, ఛేదింపబడడు. అతను పరిశుద్ధుడు, అవయవ రహితుడు, సూక్షుడు, నిరంజనుడు, మమకారం లేనివాడు, నిర్వికారుడు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ రహితుడు, ఆకాంక్ష లేనివాడు, వర్ణాలు లేనివాడు, అపవిత్రాన్ని పవిత్రం చేసేవాడు. తత్తదర్శనంలో ఆ పరబ్రహ్మయే శుద్ధముగా అగుపిస్తుంది. విద్య లేదు, అవిద్య లేదు. జగత్తు లేదు, పరాపరాలు లేవు. వ్యవహారంలో మాత్రమే సంసారం సత్యంగా ప్రకటితమవుతుంది. పరమార్థంలో సమస్త సంసారం అసత్యమవుతుంది. ఉన్నదంతా మట్టియే అయినా, ఆకారం వల్ల కుండగా పిలువబడుతున్నది.
ఆత్మను పోల్చి చెప్పడానికి మరొక నియమం లేదు. ప్రమాణమూ లేదు. ఆత్మను తెలుసుకోవడానికి దేశం, కాలం, బుద్ధి ఇవేవీ అర్థవంతంగా పనిచేయవు. బ్రహ్మవేత్తయైనవాడు అనుబంధంతో ‘తాను బ్రహ్మమును’ అని తెలుసుకొంటున్నాడు. ‘ఒక బాలుడు ఆకలితో అలమటిస్తూ కూడా ఆట వస్తువులతో ఆడుకొన్నట్లు’గా విద్వాంసుడు అహంకార మమకారాలు లేనివాడై ఆత్మలోనే రమిస్తుంటాడు. బ్రహ్మవేత్త దేహాది బంధాలనుంచి విముక్తుడు అవుతున్నాడు. మూఢులు శరీరభ్రాంతినే దర్శిస్తున్నారు. ‘పాము కుబుసం విడిచినట్లు’ జ్ఞాని దేహభ్రాంతిని విడిచి పెడుతున్నాడు. ‘నటుడు స్త్రీ వేషం వేసుకొన్నప్పుడు కాని, వేసుకొననప్పుడు కాని పురుషుడే అయి వున్న రీతి’గా శ్రేష్ఠుడైన బ్రహ్మవేత్త సర్వకాల సర్వావస్థలలోను పరబ్రహ్మయే అవుతాడు. ఆత్మవేత్త అయిన ముని, ‘క్షీరంతో క్షీరం కలిసినట్లు’గా, ‘తైలంలో తైలం కలిసినట్లు’గా, ‘ఉదకంలో ఉదకం చేరి వున్నట్లు’గా తన ఆత్మను పరమాత్మలో లీనం చేసి ఆనందిస్తుంటాడు.
యం.వి. నరసింహారెడ్డి
98491 10922