ధర్మమంటే ధరించేది అని అర్థం. ‘ధర్మచక్రం ప్రజలను దారితప్పకుండా నిలిపి ఉంచుతుంది. ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు. పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగలిగేదే ధర్మం’ అంటూ ధర్మార్థాన్ని తెలియజేసింది వ్యాస భారతంలోని శాంతిపర్వం. ‘యత్స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతినిశ్చయః’.. ఏదైతే సంఘాన్ని ఒక కట్టుబాటులో నడిపిస్తుందో అదే ధర్మమని మన సనాతన ధర్మం పేర్కొన్నది.
కం॥ ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము తన మనంబునకగుఁ దా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్
(మహాభారతం- శాంతి- 5- 220)
ఇతరులు చేసే పొరపాట్లు ఏవైతే తన మనసుకు బాధను కలిగిస్తాయో, అలాంటి తప్పులను ఇతరుల పట్ల తాను చేయకుండా ఉండటమనేదే ధర్మ మార్గాలన్నింటిలోనూ ఉత్తమమైనదని చెప్తున్నది పంచమ వేదం మహాభారతం.‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరాముణ్ని మనం ధర్మానికి ప్రతిరూపంగా చెప్పుకొంటాం. ఎన్ని విపత్తులు ఎదురైనా ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల రాముడు లోకాభిరాముడిగా గౌరవాన్ని పొందాడు. ధర్మాన్ని నాశనం చేసిన వాడిని ఆ ధర్మం ఎన్నటికైనా మట్టుబెడుతుంది. ధర్మం తనను రక్షించినవారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ‘ధర్మో రక్షతి రక్షితః’ అని మనుస్మృతి ఘంటాపథంగా చాటి చెప్పింది.
మనం జీవితంలో పాటించవలసిన నియమాలు వ్యక్తిత్వానికీ, కుటుంబానికీ, సంఘానికీ సంబంధించి ఎన్నో ఉంటాయి. ఎవరికి వాళ్లు ఆ నియమాలకు కట్టుబడి ప్రవర్తిస్తే.. అది ఆ వ్యక్తికీ, అతని కుటుంబానికీ, సమాజానికీ మేలు చేస్తుంది. సంఘంలో ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది. దానివల్ల అతడుండే కుటుంబానికీ, దేశానికీ పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. అందుకే ధర్మాన్ని గౌరవిస్తూ, అందరూ దాన్ని పాటించాలని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. కానీ, ధర్మాన్ని నశింపజేయాలని చూస్తే ఆ వ్యక్తితోపాటు వ్యవస్థ కూడా నాశనమవుతుంది.
ఉ॥ సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత బొంకుచేఁ
బారముఁ బొంద లేక చెడఁ బాఱిన దైన యవస్థ దక్షులె
వ్వారలుపేక్ష సేసిరది వారల చేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడున్
(మహాభారతం- ఉద్యోగ- 3- 273)
‘న్యాయబద్ధమైన ధర్మానికి ఎప్పుడైనా సరే పాపాత్ముల చేతల వలనే హాని జరుగుతూ ఉంటుంది. అలా ఆ ధర్మానికి హాని జరగకుండా చూడటమనేది నియంత్రించవలసిన వాళ్ల బాధ్యత. సమాజంలో జరుగుతున్న ఘోరాలను ఆపనట్లయితే అది వాళ్ల నాశనానికి మూలం అవుతుంది. ధర్మాన్ని ఎప్పుడూ రక్షించే దైవం మాత్రం చూస్తూ ఊరుకోడు. ధర్మ పతనానికి కారణమైన వాళ్లను సమూలంగా మట్టుపెడుతాడు. న్యాయబద్ధమైన ధర్మం మాత్రం చెక్కుచెదరకుండా ప్రకాశిస్తూ ఎప్పుడూ నిలిచి ఉంటుంది’ అని శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ర్టుడితో హెచ్చరించిన మాటలు ధర్మానికి ఉన్న ప్రాధాన్యాన్ని, దాన్ని రక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి.
ఎవరి పరిధిలో వాళ్లు ధర్మాన్ని రక్షించాలన్న సనాతన ధర్మం చెప్పిన ఆదేశాన్ని పాటిస్తే.. ధర్మానికి ముప్పు వాటిల్లదు. ఫలితంగా మానవులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అందుకే, ధర్మబద్ధంగా ఉండటమనే నియమాన్ని అందరూ అలవరచుకోవాలి. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. మన సనాతన ధర్మానికి మూలమైన వేదాలూ, పురాణాలూ, ధర్మశాస్ర్తాలు కూడా ఇదే అంశాన్ని చాటి చెప్తున్నాయి. అందుకే పతనమనేదే లేకుండా శాశ్వతంగా నిలిచే ధర్మాన్ని అందరం కాపాడుదాం. మనల్ని మనం రక్షించుకుందాం.
డాక్టర్ శాస్ర్తుల రఘుపతి
73867 58370