శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి ‘సప్తతి పూర్తి మహోత్సవం’ కర్ణాటకలోని శృంగేరీ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ‘లక్ష మోదక గణపతి హోమం’తో ప్రారంభమవుతున్నది.ఈ సందర్భంగా జగద్గురువుల జీవిత విశేషాలను తెలిపే వ్యాసం చదువండి.
‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మరక్షణ ద్వారానే సమాజోద్ధరణ జరుగుతుంది. ‘ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను’ అన్నది సాక్షాత్తు పరమేశ్వర ప్రవచనం. ధర్మానికి వేదాలు మూలం. వేద విహితమైన ధర్మమే సమాజ శ్రేయస్సుకు కారణమవుతుంది. అందుకే, పరమేశ్వరుడే ‘శంకర భగవత్పాదులు’గా అవతరించారు. వీరి కోవలోకి చెందినవారే ప్రస్తుత 36వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి. అందరిపట్లా ఎంతో అనుగ్రహాన్ని, దయను కురిపించే వీరి దర్శనమే ఎంతటివారికైనా ఒక దివ్యానుభూతినిస్తుంది.
శ్రీ ఖరనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి (షష్ఠి ఘడియలలో) శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు జన్మించారు. శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాదుల ఆవిర్భావానికి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి జననానికి ఎంతో సామ్యం కనిపిస్తుంది. మాతాపితరుల శివారాధనవల్ల వసంతఋతువులో జన్మించడం, అదికూడా ఉభయులదీ శుక్లపంచమియే కావడం యాదృచ్ఛికమే అయినా, ‘ఇద్దరూ పుంభావ భారతీదేవి స్వరూపులే’. ఆ తల్లిదండ్రులు తమ పుత్రునికి ‘సీతారామాంజనేయులు’ అనే నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచారు. చిన్నప్పటి నుండే సీతారామాంజనేయులు అన్ని విషయాలలో అత్యంత ఉత్సాహంగా ఉండేవారు. చదువులో ఏకసంథాగ్రాహి. శీఘ్రమే గురువులకు అప్పగించేవారు. వీరి ప్రజ్ఞాపాటవాలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. వీరు చిన్నప్పుడే పెద్దలమాటలు, పురాణగాథలు శ్రద్ధగా విని ఆచరించేవారు. నరసరావుపేటలో శ్రీ ప్రతాపగిరి శివరామ శాస్త్రిగారివద్ద సంస్కృతాధ్యయనం చేశారు. అతిస్వల్ప వ్యవధిలోనే సంస్కృతభాషలో అనర్గళంగా మాట్లాడసాగారు.
గర్భాష్టమంలోనే వీరికి ఉపనయనం జరిగింది. కృష్ణయజుర్వేద అధ్యయనాన్ని అతితక్కువ సమయంలో పూర్తి చేశారు. ఇంకా ఏదో జిజ్ఞాస వారికి ఉండేది. అదే సమయంలో శ్రీ శృంగేరీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి విజయవాడ నగరానికి వచ్చారు. 11 సంవత్సరాల ఆ బాలుడు నరసరావుపేట వాస్తవ్యులైన శ్రీ కవితా సుబ్రహ్మణ్య శాస్త్రిగారితో జగద్గురువుల దర్శనానికి వెళ్ళాడు. అక్కడ జగద్గురువులు ఈ పిల్లవాడి సంస్కృత భాషా నైపుణ్యాన్ని, చురుకుదనాన్ని గమనించారు. ఈ అపూర్వ సమ్మేళనం శ్రీ శంకర భగవత్పాదులవారు శ్రీగోవింద భగవత్పాదులవారిని చూసిన సందర్భం నాటి అద్భుత ఘట్టం వంటిదే.
మరోమారు 1966లో శ్రీ శృంగేరీ జగద్గురువులు నరసరావుపేటకు రావడం, సీతారామాంజనేయులుతో మాట్లాడటం జరిగింది. తర్వాత, ఉజ్జయినీ క్షేత్రంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న జగద్గురువులను కలిసి ‘తాను వారి వద్ద విద్యాభ్యాసం చేస్తానని’ ఆయన కోరడం, వారు ఆమోదించడం జరిగాయి. నాటినుండి శ్రీ శృంగేరీలో గురువుల సేవలో విద్యాభ్యాసం ప్రారంభించారు. ఆయనకు శాస్త్రపాఠాలు స్వయంగా మహాస్వామివారే బోధించేవారు. శ్రీ స్వామివారి పరిపూర్ణానుగ్రహం వల్ల, స్వయంగా జ్ఞానస్వరూపులైన ఆయన అతిస్వల్ప కాలంలో వ్యాకరణ న్యాయ మీమాంస
వేదాంత శాస్ర్తాలలో నిష్ణాతులైనారు.
మహదానందాన్ని పొందిన మహాస్వామివారికి శ్రీశారదాదేవి ఆజ్ఞ వచ్చింది. జగద్గురువులు, సీతారామాంజనేయుల తండ్రిగారైన శ్రీ వేంకటేశ్వరావధానులను శ్రీ శృంగేరీకి ఆహ్వానించడం ద్వారా శిష్య స్వీకారోత్సవ ఘట్టానికి అంకురార్పణ చేశారు. ఆ పర్వదినం రానే వచ్చింది. శ్రీ ఆనంద నామ సంవత్సరం ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశి. తుంగానదీ తీరంలో సర్వజన సందోహానంద భరితమైన శృంగగిరిలో, శ్రీసీతారామాంజనేయులుకు మహాస్వామి వేద విహితాలైన అనుష్ఠానాలతో కాషాయవస్ర్తాలు, దండ కమండలాలతో సన్యాసదీక్షను ప్రసాదించారు. తర్వాత శాస్త్రవిహితాలైన అనుష్ఠానాలను ఆచరింపచేశారు. ‘మూర్తీభవించిన భారతీదేవి’ స్వరూపంగా భావించి, మహాస్వామివారు ‘శ్రీభారతీ తీర్థ’ అనే యోగపట్టాను వారికి అనుగ్రహించారు. ‘సాక్షాత్తు శారదాదేవియే వ్యాఖ్యాన సింహాసనంపై అధిష్ఠించిందా’ అన్నట్లు ఆ మహోత్సవం కన్నులపండువగా జరిగింది.
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తమ గురువులైన శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారినుండి సకల విద్యలనేకాక సమస్త సంప్రదాయాలను స్వీకరించి అనుసరించారు. శ్రీ శుక్లనామ సంవత్సరం ఆశ్వీయుజ కృష్ణపంచమి గురువారం (19 అక్టోబరు 1989) నాడు శ్రీ శృంగేరీ శారదా పీఠానికి 36 వ పీఠాధిపతులుగా వారు పట్టాభిషిక్తులయ్యారు. ఆ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జగద్గురువులు ఎన్నో పర్యాయాలు విజయయాత్రలు చేశారు. భారతదేశం నలుచెరుగులా సనాతన ధర్మస్థాపన చేశారు. వేదశాస్త్ర పరిరక్షణ ద్వారానే దేశం సుసంపన్నమవుతుందని పలు వేదశాస్త్ర పాఠశాలలను స్థాపించారు. శ్రీశారదాదేవి ఆదేశానుసారం శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తమవద్ద శాస్ర్తాధ్యయనం చేసిన, తెలుగువారైన శ్రీకుప్పా వేంకటేశ్వర వరప్రసాదశర్మను ఉత్తరాధికారిగా నియమించి, ‘శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ’ అనే యోగపట్టాను అనుగ్రహించారు. ఇదికూడా మన తెలుగువారి పూర్వజన్మ సుకృతమే.
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. ఈ సప్తతి పూర్తివేళ వారిని గౌరవించుకోవం మన ధర్మం. ఆర్యాంబ-శివగురువుల శివార్చనవల్ల శ్రీ శంకర భగవత్పాదులు అవతరించినట్టుగానే, ఈ గురువుగారి జననమూ జరిగింది. గుంటూరు జిల్లా అలుగుమల్లెపాడు గ్రామవాసులు బ్రహ్మశ్రీ తంగిరాల వేంకటేశ్వరావధానులు-అనంతలక్ష్మమ్మ దంపతులు నిరంతరం రుద్రాభిషేకం ద్వారా శివుడిని ఆరాధించేవారు. నలుగురు ఆడపిల్లలు జన్మించిన తర్వాత మగపిల్లవాడికోసం శివారాధన చేశారు. ఒకరోజు అనంతలక్ష్మమ్మ స్వప్నంలో ఆంజనేయస్వామి దర్శనమిచ్చి ‘మూడు మామిడిపండ్లు’ ఇచ్చారట. ఆ దంపతులకు అవి ‘బ్రహ్మ-విష్ణు-శివుల’ అంశలుగానే గోచరించాయి. ఆ అభేద తత్త్వమే మన జగద్గురువులు.
ఇవీ కూడా చదవండి…
లక్ష్మీనారసింహుని సన్నిధిలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం