బంజారాహిల్స్ : వివాదాస్పద వీడియోలో నటించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ నటి సరయూతో పాటు మరో ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కూడా విచారించారు.
సిరిసిల్లలో ఏడాది క్రితం 7ఆర్ట్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రమోషన్ కోసం రూపొందించిన షార్ట్ ఫిలింలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు చిత్రీకరించడంతో పాటు అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారంటూ సిరిసిల్ల జిల్లా వీహెచ్పీ అధ్యక్షుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో వేమూరి నాగశ్వేత అలియాస్ సరయూ (36)తో పాటు షార్ట్ ఫిలిం దర్శకుడు, నిర్మాత శ్రీకాంత్రెడ్డి (30), కృష్ణమోహన్ (27), గణపాక కార్తీక్ (20) లతో పాటు మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు. సోమవారం ఈ కేసులో నిందితులను విచారించిన పోలీసులు మరోసారి మంగళవారం వారిని పీఎస్ కు పిలిపించారు.
షార్ట్ ఫిలిం ఎక్కడ తీశారు.. విశ్వాసాలను కించపర్చేలా తీయడానికి గల కారణాలతో పాటు ఇతర అంశాలపై లోతుగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వీహెచ్పీ అధ్యక్షుడు అశోక్ను పీఎప్ కు పిలిపించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను తీసుకున్నారు. తాము తీసిన వీడియో వివాదాస్పదం అవుతుందని ఊహించలేదని, మతపరమైన విశ్వాసాలను దెబ్బతీయాలనేది తమ అభిమతం కాదని. పొరపాటు జరిగిందని సరయూతో పాటు ఇతర నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
గతంలోనే ఈ వ్యవహారంపై తాము స్పందించడంతో పాటు అభ్యంతరకరమైన మాటలను తొలగించామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీహెచ్పీ నేతలు మాత్రం ఈ మొత్తం వీడియోను యూట్యూబ్లో నుంచి తొలగిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతోనే ఫిర్యాదు చేశామని చెబుతున్నారు.
ఇలాంటి వీడియోలు భవిష్యత్తులో తీయకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితులకు శిక్ష పడేదాకా తమ పోరాటం కొనసాగుతుందని అశోక్ తెలిపారు.