విజయనగరం : పెండ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా చౌదువాడలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురిపై శుక్రవారం తెల్లవారుజామున యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని వెల్లడైంది.
నిందితుడు రాంబాబు రాములమ్మ అనే 21 ఏండ్ల యువతితో కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతూ ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అయితే రాంబాబు ఇటీవల ఆమెను దూరం పెడుతున్న క్రమంలో రాములమ్మ పెండ్లి విషయం ప్రస్తావిస్తుండటంతో కోపం పెంచుకున్నాడు. గ్రామంలోని తమ ఇంటి వెలుపల యువతి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న వేళ నిందితుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు.