మన్సూరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్బీనగర్లోని అవినాష్ డిగ్రీ కళాశాలలో రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కల్చరల్ టీం ఇంచార్జ్ ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు సీఐ అంజపల్లి నాగమల్లు సారథ్యంలో గంజాయి తీసుకోవడం ద్వార కలిగే నష్టాలపై పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా మరోలోకం షార్ట్ ఫిలింను ప్రదర్శించి గంజాయి ఎంత ప్రమాదకరమో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సీఐ అశోక్రెడ్డి మాట్లాడుతూ కళాశాలలకు వెళ్లే తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రమాదకరమైన మత్తు పదార్థాల బారిన తమ పిల్లలు పడకుండా చూసుకోవాలని తెలిపారు.
గంజాయి, నల్లమందు విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గంజాయి తదితర మత్తు పదార్థాల పట్ల ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.
గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దేవి, పవన్, కళా బృందం సభ్యులు అరుణ్, జగన్, సురేష్, కుమార్, శ్రీశైలం, రాజు తదితరులు పాల్గొన్నారు.