Man attacks on Girl | పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి కండ్లల్లో కారం కొట్టి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. అటుగా వెళ్తున్న జనం.. ఊహించని హఠాత్ పరిణామంతో నిశ్చేష్టులైనా.. అంతలోనే తేరుకుని కర్రలతో ఆ ప్రేమ్మానాదిని చితకబాది యువతిని కాపాడారు. తీవ్ర గాయలతో ఉన్న యువతిని దవాఖానాకు తరలించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బోరంబండ బంజారానగర్లో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ సైదులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ రామారావునగర్ వాసులు సిద్ధప్ప, శాంతమ్మ కూతురు లక్ష్మి (25), బోరబండ మోతీనగర్-పీఆర్ నగర్ వాసికి కిషోర్ (28)లకు ఏడేండ్లుగా పరిచయం ఉంది. కిశోర్ గతంలో బోరబండలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహించినప్పుడు అతని వద్ద లక్ష్మి పని చేసేది. ఇప్పుడు మోతీనగర్లోని తన మామయ్య పాస్ట్ఫుడ్ సెంటర్లో కిషోర్.., మాదాపూర్లోని నోవాటెల్లో హౌస్ కీపింగ్ విభాగంలో లక్ష్మి పని చేస్తున్నది.
ఏడేండ్లుగా ప్రేమిస్తున్నానంటూ లక్ష్మి వెంట పడుతున్నాడు కిశోర్. అందుకు ఆమె నిరాకరిస్తూ వచ్చింది. ఇటీవల లక్ష్మికి పెండ్లి సంబంధం కుదిరింది. తన ప్రేమను నిరాకరించినందుకు అక్కసుతో లక్ష్మిపై కిశోర్ పగ పెంచుకున్నాడు. అదునుకోసం ఎదురు చూస్తూ సోమవారం సాయంత్రం ఆమెపై దాడి చేశాడు.
సోమవారం సాయంత్రం 4.40 గంటలకు తన తల్లి శాంతమ్మతో లక్ష్మి స్కూటీపై వెళుతుండగా, కాపు కాసిన కిశోర్ బైక్పై వెంబడించాడు. అందరూ చూస్తుండగానే బంజారానగర్ మెయిన్ రోడ్లో లక్ష్మి స్కూటీకి తన బైక్ అడ్డుపెట్టి వారిని ఆపాడు. లక్ష్మి కండ్లలో కిశోర్ కారం చల్లాడు. ఈ హఠాత్పరిణామంతో లక్ష్మి, ఆమె తల్లి శాంతమ్మ కింద పడి పోయారు. కత్తి తీసుకుని లక్ష్మి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. లక్ష్మికి హెల్మెట్ ఉండటంతోపాటు అతని బారీ నుంచి తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేసింది.
ఓ ఆటో డ్రైవర్, కొంత మంది స్థానికులు అప్రమత్తమై కిశోర్ను అడ్డుకున్నారు. పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే లక్ష్మి గొంతు కొంత వరకు తెగడంతో బాధితురాలిని చికిత్స నిమిత్తం మోతీ నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడు కిశోర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన యువతి పరిస్థితి నిలకడగా ఉందని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.