వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు కూనూరు యాదగిరి(50) తాళ్లు ఎక్కి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యాదగిరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఎలుగుబంటి గ్రామంలో సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు.