చండీగఢ్: ప్రియురాలి కుటుంబ ఆస్తిపై కన్నుపడిన ఒక వ్యక్తి, అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని నరికి చంపాడు. పంజాబ్లోని లూధియానా జిల్లాలో ఈ ఘటన జరిగింది. డెహ్లాన్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల షిందర్ సింగ్, అటవీ శాఖ డిపార్ట్మెంట్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. భర్తను వీడిన కుమార్తె, ఆయన కుటుంబంతోపాటు ఉంటున్నది. కుటుంబ స్నేహితుడైన 38 ఏండ్ల అష్రఫ్ అలీ, ఆమె మధ్య సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసినప్పటికీ ఆమె తండ్రి షిందర్ సింగ్ పట్టించుకోలేదు.
మరోవైపు పెండ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉందామని అలీపై షిందర్ సింగ్ కుమార్తె ఒత్తిడి తెచ్చింది. అయితే ఆమె కుటుంబం ఉంటున్న ఇంటిపై అతడు కన్నేశాడు. ఆ కుటుంబంలో షిందర్ సింగ్ ఒక్కడే మగ వ్యక్తి కావడంతో ఆ వృద్ధుడ్ని అంతం చేస్తే అతడి కుమార్తెతోపాటు వారి ఇల్లు కూడా తన సొంతం అవుతుందని భావించాడు. దీంతో వృద్ధుడైన షింధర్ సింగ్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
డిసెంబర్ 23న షిండర్ సింగ్ కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లాడు. బుటాహరి కాలువ వెంబడి ఉన్న చెట్లకు పెయింటింగ్, మార్కింగ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అష్రఫ్ అలీ అక్కడకు వెళ్లాడు. తన వెంట తెచ్చిన మద్యాన్ని సింగ్కు తాగించాడు. ఆ తర్వాత అతడ్ని గొడ్డలితో నరికి చంపాడు. ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరునాడు వృద్ధుడి మృతదేహం కాలువ పక్కన ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అష్రఫ్ అలీ, వృద్ధుడి కుమార్తె వెంట ఉండి అంత్యక్రియలకు సహకరించాడు. అనంతరం అతడిపై అనుమానాలు వ్యక్తం కావడంతో భయంతో పారిపోయాడు. గాలించిన పోలీసులు చివరకు అష్రఫ్ అలీని శనివారం అరెస్ట్ చేశారు. ప్రశ్నించగా ఆ వృద్ధుడి ఇంటిని సొంతం చేసుకునేందుకు అతడ్ని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.