పుణే : మహిళా యోగా టీచర్ తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్న ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సంగ్వీలో సోమవారం వెలుగుచూసింది. మహిళను విశాఖ సొంకాంబ్లే (37)గా గుర్తించారు. ఆమెకు భర్తతో పాటు పది, ఆరు సంవత్సాల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాను డ్రాయింగ్ రూంలో పిల్లలతో కలిసిపడుకున్నానని, ఉదయం లేవగానే తన భార్య విగతజీవిగా పడిఉందని ఆమె భర్త పేర్కొన్నారు. మృతురాలు చేతిరాతతో కూడిన డైరీలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారని, దీన్ని సూసైడ్ నోట్గా పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
ప్రాధమిక దర్యాప్తులో ఆత్మహత్యగా వెల్లడైందని, మహిళ తల్లితండ్రులతో పాటు కుటుంబసభ్యులను విచారించిన మీదట మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.