లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, నేరాల ఘటనలు కొనసాగుతున్నాయి. మహోబా జిల్లాలో లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు నిందితుడు నిప్పంటించిన ఘటన కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తత్వార గ్రామంలో వెలుగుచూసింది. నిందితుడికి అతడికి సహకరించిన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాలిన గాయాలైన బాధితురాలిని ఝాన్సీ మెడికల్ కాలేజ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ భర్తతో కలిసి గుజరాత్లో కూలి పనులు చేసుకునే నిందితుడు విపిన్ యాదవ్ అలియాస్ కల్లు కొద్దిరోజుల కిందట అక్కడ నుంచి తిరిగివచ్చాడు. ఆగస్ట్ 14న మహిళ ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించిన విపిన్ బలవంతంగా లోపలికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు.