అహ్మదాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇరు కుటుంబాలు అంగీకరించిన మీదట నిశ్చితార్ధం కూడా జరిగాక యువతిపై పలుమార్లు లైంగిక దాడి జరిపి ఆపై ఆమెతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తి ఉదంతం గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనంద్కు చెందిన యువతికి మొరియ గ్రామంలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో పనిచేసే యువకుడు (28)తో పరిచయం కలిగింది.
ఇద్దరి మధ్య స్నేహం పెరిగి క్రమంగా వారు సన్నిహితులయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న నిశ్చితార్ధం జరిగింది. ఈ క్రమంలో కుటుంబంలో వివాదాలు తలెత్తాయని నిందితుడు యువతి ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. త్వరలో ఇద్దరికి పెండ్లి జరుగుతున్నందున శారీరకంగా ఒక్కటవుదామని ఆమెను లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆర నెలల పాటు యువతితో సన్నిహితంగా మెలిగిన నిందితుడు పదిహేను రోజుల కిందట తన ఇంటికి తిరిగివెళ్లాడు. రెండు వారాల కిందట యువతిని కలిసిన నిందితుడు ఆమెను పెండ్లి చేసుకోలేనని తనతో సంబంధం తెంచుకోవాలని స్పష్టం చేశాడు.
నిందితుడి తల్లితండ్రులు సైతం తమ కుమారుడికే వత్తాసు పలుకుతూ తామేం చేయలేమని బాధితురాలిని ఆత్మహత్య చేసుకోవాలని సూచించారు. యువతి దిక్కుతోచని స్ధితిలో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడగా దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు నిందితుడు, అతడి తల్లితండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.