కొండాపూర్ : నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపిన సంఘటనలో ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం ఉదయం గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ జంక్షన్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్నగర్ నందిపహాడ్ గ్రామానికి చెందిన ఆమ్సాబ్, నూర్జహాన్ భేగమ్(45) భార్యాభర్తలు శేరిలింగంపల్లి గోపినగర్ కాలనీలో నివాసముంటున్నారు.
కాగా గురువారం ఉదయం గోపినగర్ నుంచి మహబూబ్నగర్కు వెళ్ళేందుకు తమ పల్సర్ బైక్పై బయలుదేరారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ జంక్షన్లో సిగ్నల్ క్రాస్ చేస్తున్న సమయంలో వెనుకాల నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా బైక్ను ఢీకొట్టడడంతో ఆమ్సాబ్ బైక్తో సహా ఎడమవైపు పడిపోగా, అతని భార్య నూర్జహాన్ కుడివైపు పడింది. ఇది గమనించని టిప్పర్ డ్రైవర్ అదే వేగంతో ముందుకు వెళ్ళడంతో టిప్పర్ టైర్లు నూర్జహాన్ ఛాతీపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఆమ్సాబ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.